దేశంలో ఆందోళన కలిగించే అత్యంత తీవ్రమైన అంశాల్లో అమ్మాయిలు, మహిళల అక్రమ రావాణా. ఉపాధి పేరుతో ఎంతోమంది అమాయకులను అక్రమంగా రాష్ట్రాలకు, దేశాలకు తరలిస్తున్నారన్న వార్తలు చూస్తూనే ఉన్నాం. పోలీసులు ఈ అక్రమాలు ఎన్ని అరికట్టినా అక్రమార్కులు ఇంకా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇదే విషయమై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మరోసారి ఉద్ఘాటించారు. ఇటువంటి దారుణాలను పూర్తిస్థఆయిలో అరికట్టాల్సిన అవసరముందని అన్నారు. ఇటివల జరిగిన దక్షిణాది రాష్ట్రాల డీజీపీల వీడియో కాన్ఫరెన్సులో ఈ అంశంపై మాట్లాడారు.
ఉపాధి పేరుతో మహిళల అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోందని అన్నారు. ముఖ్యంగా అనంతపురం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి చెన్నై, కోల్ కతా నగరాలకు ఎక్కువగా మహిళలను తరలిస్తున్నారని అన్నారు. ఇటువంటి అక్రమ రవాణాపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరముందని చెప్పారు. ఇందుకు తగ్గట్టు గట్టి చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. మహిళలు, యువతులు ఇటువంటి మోసాలకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
దక్షిణాది రాష్ట్రాలు పుదుచ్చేరి, లక్షద్వీప్ మధ్య పరస్పర అవగాహన ముఖ్యమని ఈ సమావేశంలో అన్నారు. నేరాల నియంత్రణ, సమాచార మార్పిడిపై సహకరించుకోవాలని సూచించారు. ఇంకా.. ఇసుక, మద్యం, మహిళల అక్రమ రవాణా నియంత్రణ, మాదక ద్రవ్యాల రవాణా, మావోయిస్టు, ఉగ్రవాదం.. తదితర అంశాలపై కూడా ఆయన చర్చించారు.