అమరావతి :వైసిపి తరుపున హిందూపూర్ ఎంపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ పోలీసు అధికారి గోరంట్ల మాధవ్ కు ఊరట లభించింది. మాధవ్ నామినేషన్ ను స్వీకరించాలని ఎన్నికల సంఘాన్ని ట్రిబ్యునల్ ఆదేశించింది. విఆర్ఎస్ కోసం మాధవ్ పెట్టుకున్న దరఖాస్తును వెంటనే ఆమోదించాలని ఏపి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ కారణాలతో విఆర్ఎస్ను ఆమోదించకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది.
ఎంపి జేసి దివాకర్ రెడ్డికి మీసం తిప్పి సవాల్ విసిరి గోరంట్ల వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత స్వచ్చంద పదవీ విరమణ చేసి వైసిపి తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్ ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో హిందూపూర్ ఎంపి అభ్యర్థిగా గోరంట్ల పేరును ఖరారు చేశారు.
నామినేషన్ల పర్వం మొదలవ్వటంతో విఆర్ఎస్ వివాదం తెరమీదకొచ్చింది. విఆర్ఎస్ ఆమోదించకుంటే ఆయన నామినేషన్ను తిరస్కరించే అవకాశం ఉంది. దీంతో ఆయన అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు.
ట్రిబ్యునల్ ఆదేశాలతో ఆయన హిందూపురం ఎంపీగా పోటీ చేయడం ఖాయమైంది. టిడిపి తరపున బరిలో ఉన్న సిట్టింగ్ ఎంపి నిమ్మల కిష్టప్పతో మాధవ్ పోటీ పడబోతున్నారు.