Ukraine Russia War: రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్ పై అత్యాధునిక ఆయుధాలతో రష్యా విరుచుకుపడుతోంది. రష్యా బలగాల దాడిని అదే స్థాయిలో తిప్పికొడుతోంది ఉక్రెయిన్ సైన్యం. ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నగరాలు ధ్వంసమవుతున్నాయి. రష్యా దాడులను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ ప్రజలు కూడా ఆయుధాలు చేబూని రష్యా సైనికులపై కాల్పులు జరుపుతున్నారు.
యుద్దం ముగిసే వరకూ ఉక్రెయిన్ లోనే
మరో పక్క ఉక్రెయిన్ లో వేలాది మంది భారతీయ విద్యార్ధినీ విద్యార్ధులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరంతా అక్కడ తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. ఇక్కడ ఉన్న వారి తల్లిదండ్రులు వారి పిల్లల కోసం ఆందోళన చెందుతున్నారు. భారతీయ విద్యార్ధినీ విద్యార్ధులు పౌరులను తీసుకొచ్చే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి విద్యార్ధులను తీసుకువస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఉక్రెయిన్ నుండి బయటపడతామా అని ఉక్రెయిన్ లో ఉన్న భారతీయ విద్యార్ధులు ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు అందరూ అలా ఇళ్లకు వెళ్లిపోవాలని ఆలోచన చేస్తుండగా హర్యానాకు చెందిన విద్యార్ధిని మాత్రం తాను యుద్దం ముగిసే వరకూ ఉక్రెయిన్ లోనే ఉంటానని తెలిపింది.
ఆశ్రయిం కల్పించిన ఆకుటుంబానికి అండగా
ఆ విద్యార్ధిని ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఎంబీబీఎస్ చదువుతోంది. యుద్ధం ప్రారంభం అయిన తరువాత ఆమె ఉంటున్న హాస్టల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆమె హాస్టల్ నుండి బయటకు వచ్చి నగరంలోనే మరో ప్రదేశంలో ఓ భూస్వామ్య కుటుంబంలో ఆశ్రయం పొందింది. ఆ ఇంట్లో భార్యభర్తలు, ముగ్గురు చిన్న పిల్లలు ఉంటున్నారు. ఈ విద్యార్ధిని ఆ ఇంట్లోకి వెళ్లిన తరువాత ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు పిలుపు మేరకు ఆ ఇంటి యజమాని స్వచ్చందంగా ఆయుధం చేతబట్టి ఉక్రెయిన్ సైన్యంతో కలిసి యుద్దంలో పాల్గొనేందుకు వెళ్లారు. దీంతో ఇంట్లో ఉన్న తల్లి, ముగ్గురు పిల్లలను తాను చూసుకుంటానని హర్యానా విద్యార్ధిని తెలిపింది. తనకు ఆశ్రయిం కల్పించిన ఆకుటుంబానికి అండగా ఉండేందుకు యుద్దం ముగిసేంత వరకూ ఉక్రెయిన్ లోనే ఉంటానని ఆమె తెలిపింది. హర్యానా విద్యార్ధిని చూపిన ఆ చొరవకు ఆ ప్రాంతీయులు అభినందిస్తున్నారు.