(విశాఖ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
విశాఖ నగరంలో టీడీపీ పరిస్థితి గందరగోళంగా తయారు అయ్యింది. టీడీపి నుండి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలలో ఒకరు ఇప్పటికే వైసీపీకి జై కొట్టగా మరో ఎమ్మెల్యే ఊగిసలాట ధోరణిలో ఉండటం, ఒక ఎమ్మెల్యే మాత్రమే చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొనడంతో నావికుడు లేని నావగా విశాఖ టీడీపీ పరిస్థితి తయారు అయ్యిందని అంటున్నారు.
మరో పక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడం, ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతిలోనే రాజధాని ఉండాలని పట్టుబడుతున్నారు. ఈ పరిణామం టీడీపీ కార్యకర్తలకు ఇబ్బందికరంగానే ఉంది. టీడీపీని అభిమానించే వారు సైతం తమకు వచ్చే రాజధానిని అడ్డుకుంటున్నారన్న భావన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణాలతో నేతలు పలువురు నేతలు అధికార పార్టీ వైపు చూస్తున్నారు.
పార్టీ క్యాడర్ మాత్రం నూతన నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నది. ద్వితీయ శ్రేణి నాయకులు గందరగోళాన్ని గురి అవుతున్నారుట. టీడీపీలో ఇప్పటి వరకూ నాయకులుగా చెలామణి అవుతున్న వారు ఒక వేళ అధికార పార్టీలోకి చేరినా తమకు అంతగా ప్రాధాన్యత ఉండదనీ పాత నాయకుల వెనుక నిలబడాల్సి వస్తుందన్న భావనతో సైలెంట్గా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం విశాఖలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబులు పార్టీ ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వెలగపూడిపై ఇటీవల కాలంలో పలు కేసులు నమోదు అయ్యాయి. పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అప్పుడప్పుడుగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిస్థితి అందరికీ తెలిసిందే. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కార్యకర్తలకు మనోధైర్యం కల్పించే విధంగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పాల్గొంటున్నారు. అయితే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళన చేసిన సందర్భంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇది కొంత ఇబ్బందికరంగా మారుతున్నది.
నాయకత్వ లేమితో సతమతమవుతున్న విశాఖ టీడీపీ కార్యకర్తలకు ఆత్మస్థైర్యాన్ని నింపే నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారుట. గడచిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఫ్యాన్ గాలి వీచినా విశాఖలోని నాలుగు అసెంబ్లీ స్థానాలు టీడీపీ కైవశం చేసుకున్నది. కానీ అప్పటి టీడీపి బలం ఇప్పుడు లేదు అంటున్నారు. ఈ పరిస్థితిలో విశాఖ టీడీపి క్యాడర్ను కాపాడుకునేందుకు పార్టీ అధినేత చంద్రబాబు ఏం చేస్తారో?