AP Assembly: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. అయితే గవర్నర్ ప్రసంగంలో చెప్పిన ఓ అంశంపై టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.
జగనన్న విద్యాదీవెన కింద పూర్తి రీయింబర్స్ మెంట్ ఇచ్చామని గవర్నర్ చెబుతుండగా, టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. గవర్నర్ ప్రసంగిస్తుండగానే టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. పూర్తి రీయింబర్స్ మెంట్ అంతా అబద్దమంటూ టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. 17 ప్రభుత్వ ఆసుపత్రులు కొత్తగా పెట్టామని చెబుతుండగా కూడా టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. నాడు – నేడు కూడా అంతా అధ్వాన్నమే అంటూ టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు.
దీంతో సభలో కొద్ది సేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో గవర్నర్ జోక్యం చేసుకుని తనకు త్రోట్ ఇరిటేషన్ ఉందని చెప్పడంతో టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గారు. గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ టీడీపీ సభ్యలు సభ నుండి వాకౌట్ చేశారు. సభలో టీడీపీ సభ్యుల నినాదాలకు వైసీపీ సభ్యులు పోటీగా నినాదాలు చేయడంతో సభ దద్దరిల్లింది. వాకౌట్ చేసిన టీడీపీ సభ్యులు గవర్నర్ వెళ్లే దారిలో భైటాయించే ప్రయత్నం చేయగా టీడీపీ సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు. లాబీల్లో కూడా లాఠీ చార్జి చేస్తారా అని టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గవర్నర్ ప్రసంగంలోని అంశాలు
విజయవాడలో 18.8 ఎకరాల్లో 206 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రూ.404.35 కోట్లతో ఏర్పాటు చేయడం అభినందనీయమని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఈ విగ్రహం ఏర్పాటు పట్ల సీఎం జగన్, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. విజయవాడలో ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగిందన్నారు.
అల్పాదాయ వర్గాలకు అర్ధిక లబ్ది చేకూర్చే నవరత్నాలు కార్యక్రమం అమలు చేశామన్నారు. విద్యార్ధిని, విద్యార్ధులకు బైజ్యూస్ కంటెంట్ తో టాబ్ లు ఇచ్చామన్నారు. విద్యార్ధులను గ్లోబల్ సిటిజన్స్ గా మార్చే కృషి జరుగుతుందన్నారు. ఇంగ్లీషు మీడియం వల్ల విద్యార్ధులు అంతర్జాతీయంగా పోటీ పడే పరిస్థితి తెచ్చామని అన్నారు. విద్యారంగంపై రూ.73,417 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 53.53 లక్షల రైతులకు రైతు భరోసా కింద రూ.33, 300 కోట్లు పంపిణీ చేశామని తెలిపారు.
22.85 లక్షల మంది రైతులకు 1,977 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చామన్నారు. మిచాంగ్ తుఫాను లో నష్టపోయిన రైతులకు రూ.347.55 కోట్ల సాయం అందించామన్నారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 78,84 లక్షల మంది మహిళలకు నాలుగేళ్లలో రూ.25,571 కోట్లు అందించామన్నారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కోసం రూ.54,969.05 కోట్లు, వైఎస్ఆర్ చేయూత ద్వారా రూ.14,129 కోట్లు, వైఎస్ఆర్ కాపు నేస్తం కింద రూ.2,029 కోట్లు, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద రూ.1,257.04 కోట్లు పంపిణీ చేసామన్నారు.
TDP: నిరసనగా టీడీపీ సభ్యులు అసెంబ్లీకి .. స్వల్ప ఉద్రిక్తత