విశాఖపట్నం, జనవరి 4: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తున్న శ్వేతపత్రాల్లోనూ అసత్యాలు ఉన్నట్లు తనకు అనుమానం కలుగుతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడి ప్రెస్క్లబ్లో మీడియా ముందు మాట్లాడుతూ తన పరిశీలనలో అసత్యాలు ఉన్నట్లు గమనించానన్నారు.
“మే నెలలో పోలవరం నీరు ఇస్తామని చంద్రబాబు హామీ ఇస్తున్నారు, పోలవరం ప్రాజెక్టులో అసలు మే నెలలో నీళ్లే ఉండవు” ఏలా ఇస్తారని ఉండవల్లి ప్రశ్నించారు.
20వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలను పోలవరం ప్రాజెక్టుకు తీసుకువెళ్లి చూపిండం వల్ల వచ్చే లాభమేమిటని, ఇప్పడు అమరావతికి కూడా ప్రభుత్వ సొమ్ముతో ప్రజలను సందర్శనకు తీసుకువెళుతున్నారని అన్నారు.
చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రాలపై పార్టీ నాయకులతో కాకుండా ఐఏఎస్లతో చర్చలు జరపాలని సూచించారు. ఆరోపణలపై స్పందించే పరిస్థతి ప్రభుత్వానికి లేదని ఉండవల్లి అన్నారు.