చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు. కాబట్టే ఈ సమయంలోనే వివాహాది శుభముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజుల్లో కొత్తగా పెళ్లి అయిన అబ్బాయి ఆరు నెలల కాలం అత్తా గారి ఇంట్లో ఉండే సంప్రదాయం ఉండేది. కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చొని ఉంటే, సకాలంలో జరగాల్సిన పనులు జరగవు. వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకొనే రోజులు అవి.
ఇప్పటి లాగ కాలువల ద్వారా నీరు లభించేది కాదు. సరైన సమయంలో విత్తనాలు చల్లక పొతే సంవత్సరమంతా దారిద్ర్యంతో బాధ పడవలసిందే. అందుకే కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి. అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు పెద్దలు. ఇంటి ధ్యాసతో పనులు సరిగా చేయరని ఆషాడమాస నియమం పెట్టారు.
అంతేకాకుండా, అనారోగ్య మాసం ఆషాడం. కొత్త నీరు త్రాగటం వల్ల చలి జ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన వ్యాధులు వచ్చే సమయం, స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు, అనారోగ్య దినాలలోను అశుభ సమయాల లోను, గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం కూడా ఉంది. ఇన్ని కారణాల వల్ల ఆషాడమాసాన్ని కొన్ని పనులకు నిషిద్ధం చేశారు మన పెద్దలు.