తెలుగుదేశం పార్టీ విజయ ప్రస్థానంలో కీలకభూమిక పోషించినవారు బీసీలు కాగా ఆ తర్వాతి స్థానంలో మాదిగలు ఉంటారు.అయితే మొన్నటి ఎన్నికల్లో బీసీలు వైసిపి కొమ్ముకాశారు అందుకనే ఆ పార్టీ నూటయాభైఒక్క స్థానాలను కైవసం చేసుకోగలిగింది.కానీ మాదిగలు మాత్రం ఈ రోజుకి టీడీపీనే అంటిపెట్టుకొని ఉన్నారు.
ముందు నుండి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాలలు కాంగ్రెస్ పక్షాన నిలవగా టీడీపీ ఆవిర్భావం అనంతరం ప్రత్యేకించి చంద్రబాబు ఎస్సీల వర్గీకరణకు దోహదం చేసినందున మాదిగలు ఆయన వెంట నడుస్తున్నారు.కానీ ఇప్పుడు వారికి కూడా చంద్రబాబుపై కోపం వచ్చిందట. ఇంతకుముందు ఐదేళ్ల కాలం అధికారంలో ఉన్నా కూడా తమకు చంద్రబాబు ఏమీ చేయలేదని వారు వాపోతున్నారు.అంతేగాక వైసీపీలో ఉంటూ టిడిపి పవర్ లోకి రాగానే అటువైపు చేరిన జూపూడి ప్రభాకర్రావు కారెం శివాజీ తదితరులకు చంద్రబాబు పెద్ద పెద్ద పదవులు కట్టబెట్టారని నిన్నటి ఎన్నికల్లో టిడిపి ఓడిపోగానే వారు మళ్లీ వైసిపి వైపు వెళ్లిపోయారని మాదిగల గుర్తు చేస్తున్నారు.అలాగే కాంగ్రెస్ నుంచి వచ్చిన డొక్కా మాణిక్యవరప్రసాద్కు ఏకంగా చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారన్నారు.
అదే సమయంలో పార్టీలో ముందునుండి ఉన్న మాదిగల కంటూచంద్రబాబు ఏ పదవి ఇవ్వలేదన్నారు.పార్టీని నమ్ముకుని ఉన్న వర్ల రామయ్యకు ఓడిపోయే రాజ్యసభ సీటును ఇచ్చి మాదిగలకు ఏదో చేశామన్న కవరప్ చేసుకోబోయారన్నారు.అంతకుముందు రాజ్యసభ సీటు ఆయనకు ఇచ్చినట్టే ఇచ్చి చివర్లో వేరేవారికి ఖరారు చేశారన్నారు. అయినా చంద్రబాబు ని నమ్ముకొని ఈరోజుకి తాము టిడిపికి మద్దతు ఇస్తున్నప్పటికీ తమకు పార్టీలో ప్రాధాన్యం పూర్తిగా కరువైందని మొన్నటి పదవుల పందారంలో కూడా తమకేమీ ప్రాతినిధ్యం లభించలేదని మాదిగ నాయకులు చెబుతున్నారు.
మరోవైపు జగన్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ను మాల మాదిగ కార్పోరేషన్లుగా విభజించి ఇద్దరికి చైర్మన్ పదవులను ఇవ్వటాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.ప్రకాశం జిల్లాకు చెందిన కనకారావు మాదిగ వైసిపిలో చేరిన అనతికాలంలోనే అందలం ఎక్కారని వారు ఉదహరిస్తున్నారు.ఈ పరిస్థితుల్లో టిడిపిలో ఉండి అదే పార్టీకి మద్దతిచ్చి ప్రయోజనం లేదని మాదిగలు ఒక నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.రెండు రోజుల క్రితం మాదిగ ప్రముఖులు సమావేశమై ఇదే విషయాన్ని చర్చించారని కూడా సమాచారం.ఒకటి రెండు రోజుల్లో ఈ విషయంలో క్లారిటీగా ఒక ప్రకటన వెలువడే అవకాశం లేకపోలేదు.మాదిగలు కూడా టిడిపిని విడనాడితే చంద్రబాబుకు అది పెద్ద షాకే!