విజయవాడ: కౌంటింగ్ పూర్తి అయ్యే వరకూ ఏజంట్లు అందరూ అప్రమత్తంగా ఉండాలని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సూచించారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం మరో వారం రోజుల్లో జరగనున్న నేపథ్యంలో పోలింగ్ ఏజంట్లను సన్నద్ధం చేసేందుకు వైసిపి శిక్షణా కార్యక్రమం ఏర్పటు చేసింది.
విజయవాడలోని ఎ 1 కన్వెన్షన్ సెంటర్లో గురువారం ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల్లో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సీనియర్ నేతల ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ సిఎస్ అజయ్ కల్లం, రిటైర్డ్ ఐఎఎస్ శామ్యూల్ తదితరులు కౌంటింగ్ ఏజంట్ల విధి విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు.
ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి సూచనల మేరకు కౌంటింగ్ ఏజెంట్ల విధులు, బాధ్యతలు తెలిపేందుకు ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 175 నియోజకవర్గాల్లో అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఎంపీగా పోటీ చేసిన 25 మందినీ, వారితో పాటు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లను కలిపి మొత్తం 400 మందిని ఈ శిక్షణకు పిలవటం జరిగిందని ఉమారెడ్డి అన్నారు.
ఇక్కడ శిక్షణ పొంది వారు తమ నియోజకవర్గాల్లో ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్లుగా ఉంటారో వారికి తిరిగి ట్రైనింగ్ ఇస్తారని ఉమారెడ్డి చెప్పారు. కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండేవారిని ఎన్నికల సంఘం నియమావళి ప్రకారమే నియమించాలని అభ్యర్థులకు సూచించినట్లు ఉమారెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే కౌంటింగ్కి 18 మంది, ఎంపి కౌంటింగ్కి 18 మందిని కౌంటింగ్ ఏజెంట్లను పెట్టుకునే అవకాశం ఉందని ఉమారెడ్డి అన్నారు.
కౌంటింగ్ సమయంలో ఏదైనా అనుమానం వస్తే మరో సారి కౌంటింగ్ జరిపించమనే హక్కు ఏజెంట్లకు ఉంటుందనీ, అధికారులతో పాటు ఏజెంట్లు కూడా సంతకాలు చేస్తేనే ఒక రౌండ్ పూర్తవుతుందని ఉమారెడ్డి అన్నారు. ‘కౌంటింగ్ ఏజంట్ ఒక్కసారి లోపలికి వెళ్లాక అటు ఇటు తిరగకూడదు, ఫోన్లు వాడకూడదు. దృష్టంతా కౌంటింగ్ పైనే పెట్టాలి. వీటన్నింటిపై శిక్షణలో భాగంగా తెలియజేయటం జరిగింది’ అని ఉమారెడ్డి తెలిపారు.
పోలింగ్ రోజున ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామో, కౌంటింగ్ రోజు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉమారెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో అసెంబ్లి, పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులు, చీఫ్ ఎలక్షన్ ఏజంట్లు, పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు.