YS Jagan KCR: రాజకీయ పార్టీల అధినేతలు తమ పార్టీ అధికారంలోకి రావడానికి, ఉన్న అధికారాన్ని నిలుపుకోవడానికి అనేక రకాల వ్యూహాలు, స్ట్రాటజీలు అమలు చేస్తుంటారు. అందులో ప్రధానమైనది సమయం చూసుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వెళ్లడం. ప్రత్యర్ధుల ఊహలకు, అంచనాలకు భిన్నంగా అధికార పక్షం నేతలు తమ వ్యూహాలను అమలు చేస్తుంటారు. తెలంగాణలో ఇంతకు ముందు ఏ రాజకీయ పార్టీ ఎన్నికలకు సన్నద్దంగా లేని సమయంలో కేసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి రెండవ సారి అధికారాన్ని దక్కించుకున్నారు. టీఆర్ఎస్ హాట్రిక్ కొట్టేందుకు కేసిఆర్ మరో సారి ముందస్తుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. గతంలో 2019 లో జరగాల్సి ఉండగా తొమ్మిది నెలల ముందు అసెంబ్లీని రద్దు చేసుకుని ఆరు నెలల ముందు ఎన్నికలకు వెళ్లారు. 2018 నవంబర్ లో పోలింగ్ జరగ్గా, 2018 డిసెంబర్ లో ఎన్నికల ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. కేసిఆర్ ఆశించిన విధంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు కూడా అదే తరహా పాలసీ అమలు చేయడానికి కేసిఆర్ రెడీ అవుతున్నారని వార్తలు వినబడుతున్నాయి. వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ గడువు 2023 డిసెంబర్ వరకూ ఉంది. కానీ ఆయన 2022 డిసెంబర్ నాటికి అసెంబ్లీని రద్దు చేసి 2023 మార్చి, ఏప్రిల్ నాటికి ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నారని సమాచారం. తెలంగాణలో రాజకీయ వర్గాల నుండి ఈ మాట గట్టిగా వినబడుతోంది. అందుకు కేసిఆర్ రాబోయే బడ్జెట్ సమావేశాల్లో దళిత బంధు తదితర సంక్షేమ పథకాలు ఎక్కువగా కేటాయింపులు చేయాలన్న ఆలోచన చేస్తున్నారుట. కేసీఆర్ వద్ద లేని ఎన్నికల గారడీలు అంటూ ఏమీ ఉండవు. భారతదేశ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కేసిఆర్ వద్దనే ఎన్నికల గారడీలు, ఎన్నికల మాటలు ఎక్కువగా ఉంచాయి. రాజకీయ వ్యూహాల్లో కేసిఆర్ దిట్ట అనే పేరు ఉంది. ఆయనకు రాజకీయ వ్యూహ కర్తలూ అవసరం ఉండదు. ఏపి సీఎం వైఎస్ జగన్ వద్ద వేరే తరహా ప్రణాళికలు ఉంటాయి.
YS Jagan KCR: కేసీఆర్ బాటలోనే జగన్..?
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తథ్యం అన్న మాటలు వినబడుతున్నాయి. 2023 మార్చి నుండి మే నెలలోపు ఎన్నికలు వచ్చేలా ఈ ఏడాది చివరలో కేసిఆర్ అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ తరహాలో ముందస్తు ఎన్నికలకు జగన్ సిద్ధపడుతున్నారా ..? లేదా అన్న విషయంలో అనేక అనుమానాలు, సందేహాలు వస్తున్నాయి. ఈ అనుమాలు, సందేహాలు రావడానికి కారణాలు ఉన్నాయి. ఏపిలోనూ జగన్మోహనరెడ్డి ముందస్తు ఎన్నికలకే సుముఖంగా ఉన్నారని పార్టీ అంతర్గతంగా వినబడుతోంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గడువు 2024 మే వరకూ ఉంది. కానీ 2023 అంటే ఒక సంవత్సరం ముందే అసెంబ్లీని రద్దు చేసి తెలంగాణలో ముందస్తు జరిగిన వెంటనే ఏపిలో ఎన్నికలు జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనే మాట వినబడుతోంది. 2023 అక్టోబర్, నవంబర్ సమాయానికి పోలింగ్ జరగాలి అనేటట్లుగా వైసీపీ అంతర్గతంగా లెక్కలు వేసుకుంటోంది. అయితే ఏ అధికార పార్టీ కూడా ముందస్తు ఎన్నికలపై ముందుగానే చెప్పదు. లీక్ లు కూడా ఇవ్వదు. అసెంబ్లీ రద్దుకు వారం పది రోజుల ముందు మాత్రమే అంతర్గతంగా చర్చ జరిపి ప్రకటిస్తుంటారు.
ముందస్తుకు ఇదీ కారణం..?
వైసీపీ ముందస్తు వెళ్లడానికి చాలా కారణాలు కబడుతున్నాయి. 2024 ఎన్నికల వరకూ అంటే రెండేళ్ల పాటు ప్రస్తుతం జగన్ సర్కార్ అమలు చేస్తున్న అమ్మఒడి, రైతు భరోసా, జగనన్న విద్యాకానుక, విద్యాదీవెన, వైఎస్ఆర్ అభయ హస్తం, వైఎస్ఆర్ చేయూత లాంటి పథకాల అమలునకు నిధులు సమకూర్చడం చాలా కష్టం. అప్పులు తీసుకురావడం కూడా కష్టతరంగానే ఉంది. మరో సంవత్సరం వరకూ అయితే ఏదో విధాలుగా తిప్పలు పడి సంక్షేమ పథకాలను యధావిధిగా కొనసాగించగలదు ప్రభుత్వం. వీటి అమలునకు సుమారు 80వేల కోట్లో లేక లక్ష కోట్లో కావాల్సి ఉంటుంది, ఎలాగోలా తెచ్చి లబ్దిదారులకు పంచేస్తారు. ఇంత మొత్తం నిధులను మరో ఏడాది పాటు ఖర్చు చేయాలంటే తలకు మించిన భారమే అవుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేయడంలో పరిధులను తాటేసింది. అందుకే మరో ఏడాది పాటు సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసి ముందస్తు ఎన్నికలకు వెళితే ప్రజల్లోనూ ఇచ్చిన మాట తప్పలేదన్న ప్లస్ పాయింట్ ఉంటుంది. మరో పక్క ప్రజా రంజకంగా పరిపాలన సాగిస్తుంటే ప్రతిపక్షాలు ప్రతిదీ రాజకీయం చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కుట్రలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయంటూ జగన్మోహనరెడ్డి ప్రజల్లోకి వెళితే సానుకూల పవనాలు వీస్తాయని వైసీపీ భావనగా ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తుందా..? లేదా అనే దానిపై క్లారిటీ రావాలంటే ఆరు నెలలు, సంవత్సరం ఆగాల్సిందే..!