.
గత కొద్ది రోజులుగా వైసీపీ పార్టీపైనా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపైనా, ప్రభుత్వంపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తూ వస్తున్న నరసాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణం రాజుకు మరో దెబ్బ పడింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుండి ఉధ్వాసన పలికారు. ఆయన స్థానంలో వైసీపీ ఎంపి బాలశౌరి నియమితులైయ్యారు. ఈ మేరకు లోక్ సభ సచివాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇటీవలే పంజాబ్ నేషనల్ బ్యాంకు నేతృత్వంలోని కన్శార్షియం ఫిర్యాదు మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రఘురామ కృష్ణం రాజుపైనా ఆయన సంస్థలు, డైరెక్టర్ల పైనా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
రఘురామ కృష్ణం రాజు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలపై గతంలోనే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ పార్లమెంటరీ నేతల బృందం లోక్ సభ స్పీకర్ ఓంబిల్లాను కలిసి రఘురామ కృష్ణంరాజు పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఫిర్యాదు అందజేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై రఘురామ కృష్ణం రాజు కోర్టును ఆశ్రయించారు. వైవీసీ ఎంపిల ఫిర్యాదుపై లోక్ సభ స్పీకర్ ఇంత వరకూ చర్యలు తీసుకోలేదు కానీ పార్లమెంట్ లో ఆయన స్థానాన్ని ముందు వరుస నుండి వెనుక వరుసలోకి మార్చారు. బ్యాంక్ ఫ్రాడ్ కేసులో తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటున్నందున రఘురామ కృష్ణం రాజును స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుండి తప్పించినట్లు తెలుస్తోంది. తనకు ఈ పదవి వైసీపీ వల్ల రాలేదంటూ గతంలో రఘురామ కృష్ణం రాజు ఒక సందర్భంలో వెల్లడించారు.
రఘురామ కృష్ణం రాజు ఢిల్లీలోని తన నివాసంలో నిత్యం రచ్చబండ పేరుతో మీడియా సమావేశం నిర్వహిస్తూ జగన్మోహనరెడ్డి సర్కార్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. దీంతో ఆయనకు బీజెపి అండ ఉందని అందుకే ఇష్టానుసారంగా రోజు విమర్శలు చేస్తున్నారని చాలా మంది భావిస్తూ వచ్చారు. అయితే ఇటీవల సీఎం జగన్మోహనరెడ్డి హస్తిన పర్యటనకు వెళ్లి వచ్చిన తరువాత వరుసగా రఘురామ కృష్ణం రాజుపై వ్యతిరేక చర్యలు ప్రారంభం అయినట్లు కనబడుతోంది. సీఎం వైఎస్ జగన్ ఢిల్లీలో పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులతో మాట్లాడిన మరుసటి రోజే వారు సీబీఐకి ఫిర్యాదు చేయడం వెంటనే రఘురామ కృష్ణం రాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సోదాలు నిర్వహించడం జరిగిపోయాయి. ఇది జరిగి కొద్ది రోజుల్లోనే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి ఊస్టింగ్ అయ్యింది. ఈ పరిమాణాలతో రఘురామ కృష్ణం రాజుకు అండగా కేంద్ర బీజేపీ లేదని అనుకుంటున్నారు.