AP BJP ; సోము వీర్రాజు బీజేపీ(AP BJP)కి పెద్ద ఆస్తి.. ఆయన లేకపోతే బీజేపీపార్టీ ఏమైపోయేదో.. ఏపీలో అసలు బీజేపీకి ఉనికే ఉండేది కాదు..! ఆయన మాటలు.., ఆయన లాజిక్కులు.. ఆయన రాజకీయాలు ఏపీలో బీజేపీని వెలిగిస్తున్నాయి..! ఏపీలో బీజేపీని బలోపేతం చేసే మహత్తర యజ్ఞం చేస్తున్న ఆయన తాజాగా ఆయన ఏమని సెలవిచ్చారంటే..? “ఏపీలో టీడీపీ, వైసీపీ కలిసిపోయాయట. బీజేపీని ఎదుర్కోలేక.. ఆ రెండు పార్టీలు కలిసి విశాఖ ఉక్కు ఉద్యమాన్ని పైకి లేపుతున్నాయట. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడుల అంశాన్ని పక్కకు నెట్టేయడానికి… విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం ఎటువంటి ప్రకటన చేయకముందే ఈ రెండు పార్టీలు రెచ్చగొట్టి ఉద్యమాన్ని చేయిస్తున్నాయనేది సోము గారి తాజా వాక్కు..! ఏమి లాజిక్కు బాసూ..!?
AP BJP ; ప్రైవేటీరణపై ఏమైనా హామీ ఉందా..!?
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై ఒక పరోక్ష సంకేతాన్ని కేంద్రం ఇచ్చేసింది. రాజ్యసభ వేదికగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన ప్రకటించారు. పోస్కో కంపెనీతో జరిగిన ఎంఓయూ గురించి కూడా చెప్పారు..! సో.. దీనిపై అక్కడి ఉద్యమకారులు ఉద్యమాన్ని లేవనెత్తారు. ఫిబ్రవరి 2020 అంటే.. ఏడాది కిందట నుండి ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్టు కేంద్ర మంత్రి చెప్పారు. అంత వ్యవహారం జరిగింది కాబట్టే.., పోస్కో కంపెనీ ఇప్పటికే మూడు సార్లు విశాఖ స్టీల్ ప్లాంట్ ని సందర్శించింది. ఇవన్నీ జరిగాయి కాబట్టే.. అక్కడ కార్మికులు ఉద్యమాన్ని చేస్తున్నారు. సోము గారి ఫ్రెండ్ శ్రీయుత పవన్ కళ్యాణ్ కేంద్రానికి లేఖ రాశారు. ఢిల్లీ వెళ్లారు. సోము, అండ్ బ్యాచ్ కూడా ఢిల్లీ వెళ్లారు. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం వివాదమే కాకపోతే “పవన్ కళ్యాణ్ కేంద్రానికి లేఖ ఎందుకు రాయడం..? ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు అలా ప్రకటించడం..? ఏపీ బీజేపీ నేతలు ఎందుకు ఢిల్లీ వెళ్లడం..!? అంటే అందరూ చేస్తున్నది తప్పు, అందరూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగబోతుంది అని ఊహించుకుంటున్నారన్నమాట… సోము గారు మాత్రం దాన్ని కాపాడతారన్నమాట..! ఢిల్లీ వెళ్లి, రెండు రోజులు ఉండి.., కనీసం అమిత్ షా గారిని కలవలేకపోయారు అంటూ ఇప్పటికే సోము, టీమ్ పై ఏపీలో విమర్శలు ఘాటుగా వస్తున్నాయి. వాటిని కప్పిపుచ్చుకునే క్రమంలో అసలు విశాఖ ఉక్కు అనేది చర్చనీయాంశమే కాదు, హిందూ దేవాలయాల విగ్రహాల ధ్వంసమే పెద్ద అంశం అనేలా సోము గారు సెలవిచ్చారు.
ఎంత కాముగా ఉంటె అంత మంచిది..!!
నిజానికి ఏపీలో బీజేపీ రాజకీయంగా ఎదగాలి అనుకోవడంలో తప్పు లేదు. ఓ రాజకీయ పార్టీకి కావల్సినది అదే. కాకపోతే ఆ పార్టీనే తప్పులు చేస్తూ.. ఆ పార్టీనే ఏపీని ఇరుకున పెడుతూ… ఆ పార్టీపైనే ఏపీ జనంలో కోపం ఉన్న వేళ.. సోము లాంటి నేతలు ఎంత సైలెంట్ గా ఉంటె అంత మంచిది. బీజేపీ ఏపీకి చేసిందేమి లేదు. పోలవరం నిధులు, బడ్జెట్ సహా.. ఏమి ఇవ్వలేదు. తాజాగా విశాఖ ఉక్కు అంశంలో కూడా బీజేపీ విషయంలో గుర్రు పెరుగుతుంది. దీని నుండి తప్పించుకోవాలి అంటే.. పుండుమీద కారం చల్లినట్టు మాట్లాడడం కాకుండా.., సైలెంట్ గా ఉండడమే మంచిది అంటూ సోముకి సొంత పార్టీ నేతలే సూచిస్తున్నారు. సోషల్ మీడియా, మీడియా యాక్టీవ్ గా ఉన్న ఈ తరుణంలో సోము లాంటి మాటలు ఆ పార్టీకి చేటు చేసేవే తప్ప… ప్రయోజనం కాదు. కళ్లెదుట కనిపిస్తున్నవి కూడా కాదు, కాలేదు అంటూ, కప్పిపుచ్చితే బీజేపీ లక్ష్యం నెరవేరక మునుపు ఏపీలో శాశ్వతంగా పోతుందేమో..!!