ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం కేబినెట్ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో మంత్రిమండలి సభ్యులు నీలం సాహ్నిని ఘనంగా సత్కరించారు. సీఎం జగన్ స్వయంగా పుష్పగుఛ్చం అందజేసి శాలువాతో సత్కరించారు.
నీలం సాహ్ని 2019 నవంబర్ 14న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైయ్యారు. విభజన తరువాత ఏపి తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా ఆమె బాధ్యతలు చేపట్టారు.
1984 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన నీలం సాహ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మచిలీపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్ గా పని చేశారు. తరువాత టెక్కలి సబ్ కలెక్టర్ గా , నల్లగొండ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పని చేశారు. మున్సిపల్ పరిపాలనా విభాగం డిప్యూటి సెక్రటరీగా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీగా బాధ్యతలు నిర్వహించారు. నిజామాబాద్, ఖమ్మం జిల్లాలోనూ పని చేసిన తరువాత నల్లగొండ జిల్లా కలెక్టర్ గా, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్గా, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా, ఏపి ఐడీసీ కార్పోరేషన్ వీసీ అండ్ ఎండిగా ఉమ్మడి రాష్ట్రంలో పని చేశారు. ఆ తదుపరి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. 2018 నుండి 2019 నవంబర్ వరకూ కేంద్ర సామాజిక న్యాయం, మరియు సాధికారత కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.