అమరావతి, మార్చి 26: ఎన్నికలలో నెగ్గేందుకు రాజకీయ నాయకులు పలు రకాలుగా వ్యూహాలు, ప్రతి వ్యూహాలు చేసుకోవడం చూస్తునే ఉంటాం. కీలక నియోజకవర్గాలలో విజయం సాధించేందుకు రకరకాల ఎత్తుగడలు చూస్తూనే ఉంటాం. నేడు ఓటర్లను అయోమయానికి గురి చేసే విధంగా పాలిటిక్స్ లో పాలిట్రిక్స్ ప్లే చేస్తున్నారు. అందులో భాగంగా ప్రధాన పార్టీ అభ్యర్ధుల పేరుతో సరిపోయే వ్యక్తులను ఎంచుకొని వారితో నామినేషన్ లు దాఖలు చేయించడం.
వైసిపి అభ్యర్ధిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్న పర్చూరు నియోజకవర్గంలో దగ్గుబాటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో ప్రజాశాంతి పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేయించారు. ఇదే మాదిరిగా 35 అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్ నియోజక వర్గాల్లో వైసిపి అభ్యర్ధుల పేర్లకు సమానంగా ఉండే పేర్లతో ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధులు రంగంలో ఉన్నారు.
ఇప్పటికే తమ పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ ను పోలిన విధంగా ప్రజాశాంతి పార్టీ ఎన్నికల గుర్తు హెలికాఫ్టర్ ఉందని, అదే మాదిరిగా పార్టీ ఖండువా రంగులు కూడా ఒకే మాదిరిగా ఉన్నాయనీ, గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు తికమక పడే అవకాశం ఉందని వైసిపి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు సైతం చేశారు. ప్రజాశాంతి పార్టీ ఎన్నికల గుర్తు మార్పు చేయాలని కూడా వైసిపి నేతలు ఎన్నికల సంఘాన్ని కోరారు.
ఇప్పుడు తాజాగా ఆ పార్టీ అభ్యర్ధుల పేర్లతో పోలిన వారు ప్రజాశాంతి పార్టీ తరపున రంగంలో నిలవడం వైసిపి శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది.
వైసిపి నేతలు ఈ ఎత్తుగడలను ఉటంకిస్తూ తాజాగా మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు అందజేశారు.