ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో బీజెపీ అనూహ్య ఫలితాలు సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో విజయం సాధించిన కార్పోరేటర్లు, వారి కుటుంబ సభ్యులతో చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి మొక్కుబడులు తీర్చుకున్నారు.
బీజెపీ ఎమ్మెల్యే రాజాసింగ్, కార్పోరేటర్లతో కలిసి బండి సంజయ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంలో కార్పోరేటర్లతో బండి ప్రమాణం చేయించారు. ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామనీ, బీజెపీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తామనీ కార్పోరేటర్లు అమ్మవారి సమక్షంలో ప్రమాణం చేశారు. పెద్ద సంఖ్యలో కార్పోరేటర్లు, వారి కుటుంబ సభ్యులు మొక్కులు తీర్చుకోవడానికి రావడంతో ఆలయం బీజెపీ నేతలతో కిటకిటలాడింది. వందలాది మంది బీజెపీ నేతలు ఆలయం వద్దకు ఆలయం వద్దకు చేరుకోవడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం అమ్మవారి ఆలయంలో మొక్కులు చెల్లించుకుంటామని గతంలోనే బండి సంజయ్ చెప్పిన విషయం తెలిసిందే.
కాగా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్ చుగ్ నగరానికి రానున్నారు. రెండు రోజుల పాటు ఆయన నగరంలోనే ఉండనున్నారు. పార్టీ బలోపేతంపై నాయకులతో ఆయన సమావేశాలు నిర్వహించనున్నారు. మరో పక్క బీజెపీలోకి వలసలు ఊపందుకున్నాయి. కంటోన్మెంట్ మాజీ చైర్మన్ జంపన ప్రతాప్ పాటు టీడీపీ కంటోన్మెంట్ ఇన్ చార్జి ముప్పిడి మధుకర్ నేడు బీజెపీ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యాలయంలో నేటి మధ్యాహ్నం 12 గంటలకు బండి సంజయ్ సమక్షంలో వారు బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారని సమచారం. అదే విధంగా కంటోన్మెంట్, మలక్పేట నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల నేతలు కూడా బీజెపీలో చేరనున్నారు.