రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన మాజీ మంత్రి వైఎస్ వికానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. ఏపీ హైకోర్టు ఆదేశాలతో దర్యాప్తు బాధ్యతలు స్వీకరించిన సీబీఐ అధికారులు శనివారం విచారణ మొదలు పెట్టారు. కడప ఎస్ పి కార్యాలయానికి శనివారం చేరుకున్న ఏడుగురు సీబీఐ అధికారులు ఎస్ పి అన్బురాజన్తో సమావేశం అయ్యారు. ఎన్నికలకు ముందు 2019 మార్చి 15న వివేకానంద రెడ్డి హత్య జరిగిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సిబిఐ అధికారులు అడిగి తెలుసుకున్నారు. తదుపరి పులివెందులకు వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ జరుపనున్నారు.
వివేకా హత్య జరిగి ఏడాది దాటినా మిస్టరీ వీడలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సుమారు 1,300 మందిని విచారించారు. ఈ కేసులో ఘటనా స్థలంలో సాక్షాలు రూపుమాపారు అన్న అభియోగంపై ముగ్గురిని మాత్రం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం వారు బెయిల్ పై విడుదల అయ్యారు. ఇద్దరు ముగ్గురు అనుమానితులకు నార్కో అనాలసిస్ పరీక్ష లు జరిపినప్పటికీ అసలైన నిందితులను పట్టుకోవడంలో సిట్ విఫలం అయ్యింది.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, వివేకా కుమార్తె డాక్టర్ సునీత తదితరులు ఈ కేసు దర్యాప్తు బాధ్యతను కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించాలని కోరుతూ హైకోర్టు ను ఆశ్రయించడంతో విచారణ జరిపిన హైకోర్టు.. నాలుగు నెలల క్రితం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి నివేదికను దాఖలు చేయాలని సీబీఐకి హైకోర్టు సూచించింది. ఈ కేసుకు చెందిన అన్ని రికార్డులను సీబీఐకి అప్పగించాలని సిట్ను ఆదేశించింది.