చంద్రబాబు గురించి ఏం చెప్పినా తక్కువే… ఎంత చెప్పినా ఎక్కువే…! అవును ఆయన గురించి మీడియా ఏం చెప్పినా, ఎంత చెప్పినా ఎక్కువ తక్కువలు ఉంటాయి. పాపం అమరావతిలో లేక ఇన్నాళ్లు మీడియాకు దూరమయ్యారు. అప్పుడప్పుడూ వీడియో సందేశాలు ఇస్తున్నా అవన్నీ తమ అనుకూల మీడియాకు టిఫిన్ లాంటివి, బాబు ప్రెస్ మీట్ పెడితేనే ఆ అనుకూల మీడియాకు ఫుల్ మీల్స్ భోజనం దొరికినట్టు. ఆ నాటి బాబు, మళ్ళీ ఈరోజు దర్శనమిచ్చారు. అనుకూల మీడియాకు ఫుల్ మీల్స్ భోజనం పెట్టారు. అది కూడా మామూలుగా కాదు. బాగా కాలుతున్న మతాబులా వెలుగుతున్న మొహంతో మీడియా ముందుకు వచ్చారు.
పాపం ఎంత వేచి చూసారో…!
ఆ వెలుగుకి కారణం, ఏంటయ్యా అంటే అర్జంటుగా “మోదీ నాకు ఫోన్ చేశారు. నాతో పది నిమిషాలు మాట్లాడారు, లాక్ డౌన్ జోన్లు వారీగా పెట్టాలని నేను ఆయనకు సూచించాను, పరీక్షలు పెంచాలని సూచించాను” అని వెంటనే మీడియాకు చెప్పెయ్యాలని తాహత. పాపం ఎనిమిదిన్నరకి మోదీ ఫోన్ చేసిన తర్వాత పది నిమిషాలు మాట్లాడిన తర్వాత ఎప్పుడు పది అవుతుందా అని లక్ష కళ్ళతో ఎదురు చూసి ఉంటారు. పది దాటినా తర్వాత ఈ మోదీ స్పీచ్ ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూసి ఉంటారు. ఆ ఘడియ రాగానే ప్రెస్ ని పిలిచి తన తాహత తీర్చేసుకున్నారు. మోడీ తనకు ఫోన్ చేసారు. నేను రాత్రి చేసాను. కార్యాలయంలో అందుబాటులో లేరు. అందుకే ఈరోజు చేసి పది నిముషాలు మాట్లాడారు” అని చెప్పడానికి బాబు భలే వెలిగిపోయారు.
ఆ రాక్షస మోదీ ఫోన్ కోసమేనా… బాబు…?
సరిగ్గా 13 నెలలు ముందుకు వెళదాం…! ఇదే చంద్రబాబు నోట మీడియా ముందు, జనం ముందు “మోదీ రాక్షసుడు. మోడీ ద్రోహి. మోడీ దేశానికి పట్టిన శని, మోడీకి రాజకీయం నేనే నేర్పించాను. నా తర్వాతే మోడ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ ఎన్నికల్లో మోడీకి విఘాతం తప్పదు. ఆయన అహంకారి, అది మొత్తం దించుతా, మెడలు వంచుతా” అంటూ మాటలు వచ్చేవి. ఊరూరా తిరిగి ప్రచారం చేశారు బాబు. గల్లీ నుండి ఢిల్లీ వరకు ఇదే వరుస. మూడు రోజులు ఏపీలో ప్రచారం చేస్తే ఒకరోజు ఢిల్లీలో జాతీయ నేతలతో మకాం వేసి ప్రెస్ ముందు మాట్లాడేవారు. అలాంటి బాబు ఇప్పుడు మోడీ తనకు ఫోన్ చేసారు, పది నిమిషాలు మాట్లాడారు, నేను సూచనలు ఇచ్చాను, ఆయన నా మాట విన్నారు. అంటూ చెప్పుకున్నారు. ఆ మాటల్లో కూడా తనతో మోడీ స్నేహితుడు అయినట్టు, ఇక టిడిపి, బిజెపి కలిసిపోయినట్టు ఎంతో ఉత్సాహంతో, ఉత్సుకతతో చెప్పుకున్నారు. అదన్నమాట సంగతి. బళ్ళు ఓడలు అవ్వడం, ఓడలు బళ్ళు అవ్వడం అని విన్నాం కానీ మరీ పీహెచ్డీ స్థాయి నుండి ఇంటెర్మీడియట్ స్థాయికి దిగిపోతారని కలగని ఉండరు.