కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రతి సవాలు వెనకాల ఒక అవకాశం ఉందనే నమ్మకంతో ముందుకు వెళ్లాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాదులో జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్ ను సందర్శించిన సమయంలో ఆ సంస్థ ఉద్యోగస్తుల తో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ టీకా తయారీ విభాగంలో హైదరాబాద్ కి చెందిన భారత్ బయోటెక్ ముందంజలో ఉండటం గర్వంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
అంతేకాకుండా మహమ్మారి కరోనా టీకా..తొలుత హైదరాబాద్ నుండి అందులో భారత్ బయోటెక్ సంస్థ నుండి వస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఫార్మా రంగానికి సంబంధించి హైదరాబాదులో అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్ లలో మూడోవంతు హైదరాబాదులోనే తయారవ్వటం చాలా ఆనందంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రపంచ దేశాలు టీకా తయారీ విషయంలో భారత్ ఎప్పుడు కీలకమే అని పదే పదే చెబుతున్నాయి, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్ ప్రాముఖ్యత పెరిగిందని తెలిపారు. ఇదంతా మీ అందరి కృషి వల్లే సాధ్యమంటూ భారత్ బయోటెక్ సంస్థ కి చెందిన ఉద్యోగస్తులను కేటీఆర్ ప్రశంసించారు. జరిగిన ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ తో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కూడా పాల్గొన్నారు.