దేశ ఆర్థిక రాజధానిగా పిలవబడే ముంబై నగరాన్ని ప్రకృతి పగ పట్టినట్లు పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ తో మొదటి నుండి దేశంలో అనేక ఇబ్బందులకు ఎదురవుతున్న ఈ నగరం పై ఇప్పుడు వర్ష ప్రభావం భారీ స్థాయిలో చూపించడంతో ముంబై మొత్తం జలమయమైంది. ఆగస్టు మూడో తారీకు నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో ముంబైలో రోడ్లు మొత్తం జలమయమయ్యాయి.
వరద నీటితో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ప్రస్తుతం ముంబైలో రోడ్డు మొత్తం జలమయం అవడం తో పరిస్థితి 2005 ని తలపిస్తుందని ముంబై వాసులు అంటున్నారు. 2005 లో భారీ వర్షాలు వెయ్యి మందిని బలి తీసుకున్నాయి. ఇంకొన్ని రోజులు ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఆగస్టు 3 వ తారీకు నాలుగు గంటల వ్యవధిలోనే 198 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవడం 15 సంవత్సరాల తర్వాత రికార్డ్ అని, ప్రపంచంలో మరే నగరంలో అయిన ఈ స్థాయిలో వర్షం పడితే కనుమరుగవడం గ్యారెంటీ అని ముంబై అధికారులు చెప్పుకొస్తున్నారు.
భారీ వర్షాలు కురవడంతో ముంబై అధికారులు అప్రమత్తమయ్యారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ బృందాలను సిద్ధంగా ఉంచారు. అంతే కాకుండా విద్యుత్ శాఖ తో పాటు రవాణా శాఖ ను కూడా అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాలలో పేరుకుపోయిన వరదనీటిని తోడడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాట్లు చేశారు. వర్షాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
దీంతో ముంబైలో అత్యవసర సేవలు మినహా అన్ని రకాల షాపులు, కార్యాలయాలు మూసి వేసినట్లు ముంబై అధికారులు చెప్పుకొచ్చారు. కరోనా కారణంగా అతి తక్కువగా నడుపుతున్న లోకల్ ట్రైన్స్ కూడా రద్దు చేసినట్లు, అదే రీతిలో వర్షాల వల్ల ఎఫెక్ట్ అయిన ప్రాంతాల్లో బస్సు సర్వీసులను కూడా వేరే మార్గం లోకి మళ్లించినట్లు బీఎంసీ అధికారులు తెలిపారు. ప్రజలెవరూ అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని హెచ్చరికలు జారీ చేశారు.