చంద్రబాబు కి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలన్నది వైసిపి వ్యూహమని ప్రత్యేకంగా చెప్పే పని లేదు. నిజానికి టిడిపి ఎమ్మెల్యేలను లాగేసుకోవాలని జగన్ వ్యూహం కాదు. టిడిపి కి కనీసం 40 , 50 స్థానాలు వచ్చి ఉంటె ఆ జోలికి వెళ్లేవారు కాదేమో..! కానీ 23 స్థానాలే రావడంతో… బాబు ప్రతిపక్ష హోదాకి చెక్ పెట్టడం జగన్ కి సులువైన పనిగా మారింది. అందుకే ఇష్టం లేకపోయినా… జగన్ ఎమ్మెల్యేల చేరికను ప్రోత్సహిస్తున్నారు. దీని వెనుక రెండు కారణాలు… బాబుకి ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయడం మొదటిది కాగా.., వచ్చే ఎన్నికల నాటికీ టిడిపి ని పూర్తిగా చులకన చేయాలన్నది రెండో వ్యూహం..! మరి ఇప్పటికే ముగ్గులు ఎమ్మెల్యేలను కోల్పోయి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్న టిడిపిలో మరో నలుగురు జంప్ అయితే బాబుకి ఆ హోదా గల్లంతే. ఇప్పుడు ఆ అవకాశాలను చూద్దాం.
సిద్ధంగా ముగ్గురు ఎమ్మెల్యేలు…!
ప్రస్తుతం టిడిపిలో ఉన్న 20 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు వైసిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఈ నెలాఖరు లోగా ముహూర్తం పెట్టుకోగా… ఆ జిల్లాలోనే మరో ఎమ్మెల్యే కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. అంతా అనుకున్నట్టు జరిగితే, జగన్ సై అంటే అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కూడా చేరే అవకాశం ఉంది అంటున్నారు. కొండపి ఎమ్మెల్యే స్వామి తో కూడా వైసిపి కీలక నేతలు చర్చలు జరుపుతున్నారు. ఇక గుంటూరు జిల్లాలో కూడా ఓ ఎమ్మెల్యే వైసిపి తో టచ్ లో ఉన్నట్టు సమాచారం. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ తో ప్రస్తుతం అంతర్గత సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. వీళ్ళే కాకుండా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ తో కూడా కొందరు మాట్లాడుతున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు టిడిపి ఎమ్మెల్యేలతో వైసిపి నేతలు చర్చలు జరుపుతుండడం ఇది కచ్చితంగా బాబు ప్రతిపక్ష హోదాకి చెక్ పెట్టేందుకే అని వార్తలు వస్తున్నాయి.
వర్గాలు లేకుండా సర్దుబాట్లు కష్టమే…!
ఇప్పుడు ఎమ్మెల్యేలను లాగేయడం సులువే. కానీ అక్కడ సర్దుబాట్లు చేయడం… ముందు నుండి ఉన్న ఇంచార్జిలను పక్కన పెట్టకుండా, ఇరువర్గాలను జాగ్రత్తగా కాపాడుకోవడమే సవాలు. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే జగన్ వ్యూహం ఫలించినట్టే. లేకుంటే ఇప్పుడు ఎమ్మెల్యేలను చేర్చుకుని.., స్థానికంగా ముందు నుండి ఉన్న ఇంచార్జిలను ఇబ్బందులకు గురి చేస్తే బాబుకి, జగన్ కి తేడా ఏమి ఉండదు అన్న అపవాదు వస్తుంది. చీరాలలో ఇప్పటికే ఆధిపత్య పోరు ముదిరింది. ఇక్కడ ఇంచార్జి ఎవరు? ఎవరి ప్రాధాన్యత ఎంత? అనేది తేల్చలేకపోతున్నారు. అధికారులు, కార్యకర్తలు, పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక రానున్నటిడిపి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి లేకుండా ఉండాలి అంటే ముందు చీరాల లో గొడవలకు చెక్ పెట్టాల్సి ఉంది. అదే ఇప్పుడు వైసిపి పెద్దల మదిలో ఉంది. మరో వారం, పది రోజుల్లో దీనికి పరిష్కారం చూపించి, తర్వాత కొందరు టీడీపీ ఎమ్మెల్యేలకు వాలా వేసే వీలుంది అంటున్నారు.