దుబ్బాక ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చతికిల బడటంతో సొంత క్యాడర్ లోనే తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. నాయకుల మధ్య సమన్వయ లోపం వల్లనే దుబ్బాక ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాణించలేకపోయింది అని చాలామంది అంటున్నారు. ఇదిలా ఉండగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా ఇదే సీన్ రిపీట్ అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో కనుమరుగయ్యే పరిస్థితి ఉందని ఆ పార్టీకి చెందిన కీలక నేతలు తెగ టెన్షన్ పడుతున్నారట. దీంతో జిహెచ్ఎంసి ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం అయినా మల్కాజిగిరి ఎంపీ కాంగ్రెస్ పార్టీ కీలక నేత రేవంత్ రెడ్డి తన పరిధిలో ఉండే డివిజన్లు అన్నిటిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ తరఫున నిలబడే క్యాండెట్ లను సర్వే ఆధారంగా రేవంత్ రెడ్డి సెలక్ట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదే తరుణంలో కిందిస్థాయి క్యాడర్ ని కూడా అన్ని విధాలా సిద్ధం చేసి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు తన నియోజకవర్గం నుండి గెలిచే విధంగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే ఆయా ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో రేవంత్ సమావేశమైనట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో కూడా విజయం సాధించాలని బిజెపి నేతలు అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరికివారు వ్యూహాలు వేసుకుంటున్నారు. ఈ గ్రేటర్ ఎన్నికలలో కాంగ్రెస్ కనుక రాణించలేకపోతే… తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారటం గ్యారెంటీ అని విశ్లేషకులు అంటున్నారు.