(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇటీవల ఏపి హైకోర్టు పనితీరుపైనా, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణపైనా ఆరోపణలు చేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్డేకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. జగన్మోహన రెడ్డి ఫిర్యాదు చేసిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజయ్ కళ్లాం మీడియాకు వెల్లడించడం ఇటు రాష్ట్ర స్థాయిలోనూ, అటు న్యాయవ్యవస్థలోనూ తీవ్ర కలకలాన్ని రేపుతున్నది. ఈ అంశం అటు న్యాయవ్యవస్థలో, ఇటు రాజకీయ, మేధావి వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఈ అంశంపై సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ లేఖను బహిర్గతం చేసిన కారణంగా ఇప్పుడు తప్పక విచారణ జరిపించాల్సిన పరిస్థితి ఉందని ప్రశాంత్ భూషణ్ అన్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను బహిర్గతం చేయకపోతే ఈ విషయాన్ని పక్కన పెట్టేవారని ప్రశాంత్ భూషణ్ అభిప్రాయపడ్డారు. జస్టిస్ రమణపై ఏపి సీఎం వైఎస్ జగన్ చేసిన ఆరోపణల మీద అత్యున్నత ట్రాక్ రికార్డు ఉన్న సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తులతో తక్షణం విచారణ జరిపించాలని ప్రశాంత్ భూషణ్ డిమాండ్ చేశారు.
సూర్యరశ్మి అంత్యంత శక్తివంతమైన క్రిమి సంహారకం అని ప్రపంచం అంతా నమ్ముతుంది అలాంటప్పుడు న్యాయ వ్యవస్థలో లోపాలను చీకట్లో దాచాలని ఎందుకు అనుకుంటున్నారని అని ప్రశాంత్ భూషణ్ ప్రశ్నించారు.