చెన్నై, డిసెంబర్ 31: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సరైన చికిత్స అందించలేదని న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం సంచలన ఆరోపణ చేశారు. ఆస్పత్రిలో చేరిన వెంటనే జయలలితకు మెరుగైన చికిత్స అందించలేదని, మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లి ఉంటే ఆమె బతికేవారనీ అన్నారు. మెరుగైన చికిత్స కోసం అమ్మను విదేశాలకు తీసుకెళ్లకుండా ఉండేందుకు కుట్రలు జరిగాయన్నారు.
‘జయలలితకు యాంజియోగ్రామ్ చేయడాన్ని ఎవరు వ్యతిరేకించారో చెప్పాలని కోరారు. అమ్మ మృతి వెనుక అన్నీ అనుమానాలే దాగి ఉన్నాయన్నారు. అమ్మ మృతిపై విచారణకు ఆదేశించాలని షణ్ముగం డిమాండ్ చేశారు.
2016 సెప్టెంబరు 22న జయలలిత అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ జయలలిత డిసెంబరు 5న తుదిశ్వాస విడిచారు. అమ్మ మృతిపై వచ్చిన అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. ఇప్పటికే ఈ కేసులో పలువురికి నోటిసులు అందాయి. వచ్చే నెల సీఎం పళనిస్వామితో పాటు పలువురు కీలక నేతలను ఈ కేసులో భాగంగా విచారిస్తారు.
.