కర్నూలు, మార్చి 20: నంద్యాల పార్లమెంట్ సభ్యుడు ఎస్పివై రెడ్డి కుటుంబం జనసేన పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. జనసేన పార్టీ తరపున ఎస్పివై రెడ్డి ఎంపి అభ్యర్థిగా ఆయన కోడలు శైలజ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకపోవడంతో ఎస్పివై రెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని కూడా ప్రకటించారు. తమ కుటుంబం తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు కూడా తెలియజేశారు.
మూడు పర్యాయాలు వరుసగా నంద్యాల పార్లమెంట్ నుండి గెలిచి వివాదరహితుడుగా, నిజాయితీపరుడుగా పేరున్న ఎస్పివై రెడ్డి జనసేన పార్టీలో చేరితే జిల్లాలో పార్టీకి లాభిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీనియర్ నేత నాదెండ్ల మనోహర్లు భావించి జిల్లా నాయకుల ద్వారా పార్టీలోకి రావాలని కోరినట్లు తెలిసింది.
ఇప్పటికే కార్యకర్తలు కూడా జనసేన తరపున పోటీ చేయాలని ఎస్పివై రెడ్డిపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ కూడా పార్లమెంట్ అభ్యర్థిత్వం ఖరారు చేయడానికి సుముఖంగా ఉండటంతో నేడో రేపో ఎస్పివై రెడ్డి కుటుంబం జనసేన పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ వర్గాలు ద్వారా తెలిసింది.
2014లో వైసిపి తరుపున ఎంపిగా విజయం సాధించిన ఎస్పివై రెడ్డి అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు.