సాధారణంగా ఏ మంత్రి పుట్టినరోజు వేడుకలు అయినా ఆ పార్టీ వారు నిర్వహించుకుంటారు లేదా ఆయన అభిమానులు జరుపుతారు. ఇందుకు భిన్నంగా చిత్తూరు జిల్లాకు చెందిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుట్టిన రోజు వేడుకలను చిత్తూరు జిల్లా సీఈవో అధికారికంగా నిర్వహించటం వివాదాస్పదమైంది.
అధికారులు అంటే రాజకీయాలకతీతంగా స్వతంత్రంగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అలాంటిది జిల్లా ఉన్నతాధికారులలో ఒకరైన సీఈఓ కేడర్ అధికారి మంత్రి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడమే కాకుండా ఆయనను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మైనింగ్ శాఖల మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదినం సందర్భంగా ఆదివార౦ చిత్తూరు జిల్లాపరిషత్ కార్యాలయం వద్ద ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ ను జిల్లాపరిషత్ ఇంచార్జి చిత్తూరుసి ఈ ఓ ప్రభాకర రెడ్డి కట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే గాక రాష్ట్రవ్యాప్తంగా పదవులకు వన్నె తెచ్చే నేతగా గుర్తింపు పొందిన నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని అదేవిధంగా ఉద్యోగుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఎంతోమందిని పేరుపేరునా పిలిచి అభిమానించే నాయకుడిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండగా ఉంటున్నారని ఆయన జన్మదినం మన శాఖ మంత్రిగా చేసుకోవడం ఆనందమని ఆయన అన్నారు. ఆయనతో పాటు కుటుంబానికి కూడా మంచి ఆరోగ్యం కల్పించాలని దేవుళ్లను కోరుకుంటున్నట్లు సీఈఓ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి పి ఆర్ సి కోఆర్డినేటర్ షణ్ముగరాం, ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి అధికారుల ఓవర్ యాక్షన్ వల్లే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తోంది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఇలాంటి అధికారులే కారకులు అవుతున్నారు. ఇలాంటి చర్యల ద్వారా వారు ప్రజా విశ్వాసాన్ని కూడా కోల్పోతారు. మేము మంత్రిగారి తొత్తులమని వారికి వారే టాగు కట్టుకోవడం ఎంతవరకు సమంజసమో అధికారులే ఆలోచించాలి .