(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: టిడిపిపై సాక్షి మీడియా, వైసిపి నేతలు విష ప్రచారాన్ని మానుకోకపోతే న్యాయ పరంగా చర్యలు తీసుకుంటామని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు హెచ్చరించారు. వైసిపి నేతలు, సాక్షి మీడియాపై యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పిఏలు, పిఎస్ లకు, పార్టీకి సంబంధం ఏం ఉంటుంది..?మాజీ పిఎస్ శ్రీనివాస్ కు టిడిపితో ఏం సంబంధం ఉంటుంది..? అతనొక ప్రభుత్వ అధికారి మాత్రమే. ఆయనపై దాడులు అతని వ్యక్తిగతం. వాటిని టిడిపికి ముడిపెట్టడం కావాలని బురద జల్లడమే’ అని యనమల అన్నారు.
40ఏళ్ల చంద్రబాబు రాజకీయ చరిత్రలో 10 నుండి 15మంది పిఎస్ లు, పిఏలు పని చేసారని పేర్కొన్నారు. మాజీ పిఎస్ పై దాడులు జరిగితే పార్టీకి అంటగట్టడం హేయమన్నారు. దేశవ్యాప్తంగా 40 చోట్ల దాడులకు టిడిపికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. టిడిపిపై ఫిర్యాదులు చేసేందుకే విజయసాయి రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారన్నారు. ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా చేసింది కూడా టిడిపిపై ఫిర్యాదుల కోసమేననీ యనమల అన్నారు. జగన్ షెల్ కంపెనీల సృష్టికర్త విజయసాయి రెడ్డేననీ, వాటిని కప్పిపుచ్చుకోడానికే ఢిల్లీ స్థాయి పదవులు ఇచ్చారని విమర్శించారు. తన తరఫున పైరవీలకు, టిడిపిపై ఫిర్యాదులకే ఢిల్లీలో విజయసాయి రెడ్డిని పెట్టారని ఆరోపించారు.
జగన్ అక్రమాస్తుల విచారణ తుదిదశకు చేరిందనీ, శిక్ష తప్పదని తెలిసే ట్రయల్స్ ను అడ్డుకుంటున్నారనీ యనమల ఆరోపించారు. ఎనిమిది ఏళ్లుగా సిబిఐ, ఈడి ఎంక్వైరీకి అడ్డంకులు పెడుతున్నారనీ, కోర్టుకు హాజరు కాకుండా పదేపదే మినహాయింపులు కోరేది అందుకేననీ అన్నారు. ఎక్కడో ఎవరో మాజీ పిఎస్ పై రెయిడ్స్ కు టిడిపికి అంటగట్టడం ఏమిటని ప్రశ్నించారు. ‘రివర్స్ టెండర్ కాంట్రాక్ట్ మీరిచ్చిన ఇన్ ఫ్రా కంపెనీపై దాడికి, టిడిపికి సంబంధం ఏంటి..? తెలంగాణలో ఇన్ ఫ్రా కంపెనీపై దాడికి టిడిపికి సంబంధం ఏంటి..? రెయిడ్స్ జరిగిన ఇన్ ఫ్రా కంపెనీకే కాంట్రాక్ట్ లు మీరివ్వలేదా..?’అని యనమల ప్రశ్నించారు.
‘చంద్రబాబుపై గతంలోనే 26 ఎంక్వైరీలు వేశారు. సభా సంఘాలు, న్యాయ విచారణలు, సిబిసిఐడి అన్నీ చేశారు. ఎందులోనూ వాళ్ల ఆరోపణలు రుజువు చేయలేక పోయారు’ అని యనమల గుర్తు చేశారు.