(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
విజయవాడ: వైసీపీ ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తీవ్ర స్థాయిలో విమర్శించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం నేత బాబురావు నేడు నిరాహార దీక్ష చేపట్టారు. బాబురావు దీక్షకు సంఘీభావం తెలిపిన మధు మీడియా తో మాట్లాడుతూ అమరావతి నుంచి విశాఖకు రాజధానిని తరలిస్తే అర్ధికపరమైన ఇబ్భందులొస్తాయని పేర్కొన్నారు. వైసిపికి ఓటేసిన ప్రతిఒక్కరూ ఇప్పుడు బాధపడుతున్నారన్నారు. మూడు రాజదానులనేది ఉత్తి మాటేననీ, విశాఖపై ప్రభుత్వానికి ఎందుకంత ప్రేమో అర్దం కావడం లేదనీ అన్నారు. టిడిపి ఇన్ సైడ్ ట్రేడింగ్ తో పాటు అనేక తప్పులు చేసిందని వైసిపి ఆరోపిస్తుందన్నారు. టిడిపి రాజధానిపై ఎంతో గ్రాఫిక్స్ చూపించింది వాస్తవమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో, దేశంలో కొత్తగా వచ్చే పరిశ్రమలు ఏమీ లేవు కాని రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రం ఉందని మధు అన్నారు.
వైసిపి చేసిన నిర్ణయం వల్ల రాష్ట్రానికి భారీ నష్టం కలుగుతోందని అయన ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి హయాంలో తాము పూలింగ్ వద్దని చెప్పమనీ, అయినా వినలేదనీ చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు హ్యాపీగా లేరనీ, ఏంటి దరిద్రమంటూ బాధ పడుతున్నారనీ మధు అన్నారు. 151స్ధానాలు వచ్చాయని వైసిపి తెగ ఉపన్యాసాలిస్తుంది కాని తూర్పు తిరిగి దండం పెట్టడానికి ఎంత సేపు సమయం పట్టదన్న విషయం గుర్తుంచుకొవాలని అయన వ్యాఖ్యనించారు. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే ఆ శని జగన్ కు ఐదేళ్ళ పాటు పట్టుకుంటుందన్నారు. రాజధాని అమరావతి అంటేనే రాజధాని రైతులు భూమి ఇచ్చారని పేర్కొన్నారు. కౌన్సిల్ రద్దు, రాజధాని తరలింపు తో వైసిపి తన గొయ్యి తానే తవ్వుకుంటుందని అన్నారు. చంద్రబాబు రాజధాని విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నా అందరూ బలపరిచారనీ, ఇప్పుడు రాజధాని తరలింపు అనేది సరైంది కాదనీ స్పష్టం చేశారు. అధికారంలొకి వస్తే చాలా మందికి కన్నూ మిన్ను కనబడవని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ తన మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి లేకుంటే భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మధు హెచ్చరించారు.