(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: ఆంద్రప్రదేశ్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలు వాయిదా పడినా అధికార వైసిపిలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెలలోనే పలువురు టీడీపీ ముఖ్యనేతలు వైసీపీలో చేరిపోయారు. ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ్ ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిసి ఆయన కుమారుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పించి ఆయన పార్టీ అసోసియేట్గా మారిపోయారు. అదే మాదిరిగా మాజీ మంత్రి పాలేటి రామారావు, టిడిపి ఎమ్మెల్సీ డాక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి, ఆయన కుమారుడు గాదె మధుసూధనరెడ్డిలూ వైఎస్ఆర్ కాంగ్రెస్ గూటికి చేరారు.
తాజాగా అనంతరం జిల్లా సింగనమల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ, మాజీ మంత్రి శమంతకమణి, ఆమె కమార్తె, మాజీ ఎమ్మెల్యే యామినీబాలలు నేడు వైసీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు. గత కొద్ది కాలంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఖరి పట్ల వీరు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లుపై ఓటింగ్ సమయంలో టీడీపీ విప్ జారీ చేసినా కూడా శమంతకమణి సమావేశానికి గైర్హజరు అయ్యారు. ఆ నాటి నుండే తల్లి కూతుర్లు త్వరలో టీడీపీకి గుడ్బై చెప్పనున్నారంటూ వార్తలు వినిపించాయి.
శమంతకమణి తొలి సారిగా కాంగ్రెస్ పార్టీ నుండి 1985లో పోటీ చేసి ఓడిపోయారు. 1989లో మరల కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేశారు. ఆ తరువాత టీడీపీలో చేరారు. 2004,2009 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన శమంతకమణి కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత పిసిసి చీఫ్ సాకే శైలజానాధ్ చేతిలో పరాజయం పాలయ్యారు. 2014 ఎన్నికల్లో శమంతకమణి కుమార్తె యామినీబాల టిడిపి నుండి పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతిపై విజయం సాధించారు. చంద్రబాబు ప్రభుత్వంలో విప్గా పని చేశారు. 2019 ఎన్నికల్లో గత ప్రత్యర్థి జొన్నలగడ్డ పద్మావతి చేతిలో యామినీబాల పరాజయం పాలైయ్యారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందే చంద్రబాబు అనంతపురం జిల్లా సమీక్ష సమావేశంలో తల్లీ కూతుళ్లపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారని వార్తలు వచ్చాయి. అప్పటి నుండే వారిలో అసంతృప్తి మొదలైనా సర్దుకుపోతూ వచ్చారని సమాచారం. రాష్ట్రంలో వేగంగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీకి కనుచూపు మేరలో భవిష్యత్తు లేదన్న భావనతో వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడవుతోంది.