(అమరావతి నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా తయారైన ఆ పార్టీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు ఆ పార్టీ నేతలకు మరో సవాల్ విసిరారు. తనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను మరో సారి కోరతామని ఆ పార్టీ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ మిథున్ రెడ్డి అనడంపై రఘురామ కృష్ణం రాజు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాను వైసీపీ ఆదేశాలు దిక్కరించడం లేదనీ స్పష్టం చేసిన రఘురామ కృష్ణం రాజు పార్టీ, ప్రభుత్వం చేస్తున్న తప్పులను సరిదిద్దుకోవాలని సూచించడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. నీటి పారుదల శాఖ, రోడ్ల నిర్మాణంలో బీభత్సమైన అవినీతి జరుగుతోందని విమర్శించారు రఘురామ కృష్ణం రాజు. కొన్ని అంశాల్లో అవినీతి జరుగుతోందనీ, అది సిఎం జగన్కు తెలిసి జరుగుతున్నాయా లేదా అని ఆలోచించుకోవాలని అన్నారు. ఇప్పటికైనా జగన్ తన చుట్టూ ఉన్న వారు చేసే పనులు ఒక సారి గమించుకోవాలని హితవు పలికారు రఘురామ కృష్ణం రాజు. ఈ మధ్య కాలంలో పార్టీలోని అన్ని వ్యవహారాలు ఓ అధికారి పర్యవేక్షిస్తున్నాడని అన్నారు. పార్టీలో కులం, మతం ఆధారంగా వివక్ష చూపుతున్నారని రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు.
వైసీపీ పార్లమెంట్ నాయకుడు మిథున్ రెడ్డి తీరు సరిగా లేదనీ ఆయన వైఖరి పట్ల తాను తీవ్ర అసహనంతో ఉన్నానని పేర్కొన్నారు. కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే పదవులు కట్టబెడుతున్నారని మరో సారి ఆరోపించారు. తనపై ఎన్ని కుట్రలు చేసినా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుండి తొలగించలేరని స్పష్టం చేశారు రఘురామ కృష్ణం రాజు. పార్లమెంట్లో అత్యదిక హజరు శాతం ఉండి ప్రశ్నలు అడిగిన తన లాంటి వారిని మాత్రం పార్లమెంట్లో లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇవన్నీ చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా లేదా అన్న అనుమానం కలుగుతోందని అన్నారు.
తనపై అనర్హత వేటు వేయాలని కోరుతున్న తమ పార్టీ ఎంపిలు ముందుగా రాజ్యాంగంలోని షెడ్యూల్ 10ని చదువుకోవాలని సూచించారు రఘురామకృష్ణం రాజు. వైసీపీ లోక్ సభాపక్ష నేతకు మళ్లీ ఎన్నికలు పెడితే మిథున్ రెడ్డికి మూడు ఓట్లకు మించి రావని అన్నారు. తనను పార్టీ నుండి బహిష్కరించినా పార్లమెంటర్లో స్టాండింగ్ కమిటీ చైర్మన్ గానే కొనసాగుతాననీ కావాలంటే బహిష్కరించి చూడాలని సవాల్ విసిరారు రఘురామకృష్ణం రాజు.