బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఆ వివాదంపై ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. ఇదే వరుసలో బాలీవుడ్లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న డ్రగ్ మార్కెట్ కూడా బయటపడింది. దీంతో ఒక్కసారిగా భారతదేశ చలనచిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ఈ వ్యవహారం పార్లమెంటు వరకు వెళ్ళింది. పార్లమెంట్ సమావేశాలను తీవ్రమైన చర్చకు దారి తీసి ఒక్కసారిగా హౌస్ ని కుదిపేసింది. ఈ వ్యవహారంపై మొదటగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే సినీ నటుడు…. బిజెపి ఎంపీ రవి కిషన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బాలీవుడ్ లో డ్రగ్స్ వినియోగం విపరీతంగా ఉందని… ఇండస్ట్రీని నాశనం చేసేందుకు కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. అలాగే పొరుగు దేశాలు ఇందుకు సహకరిస్తున్నాయని…. పాకిస్తాన్ చైనా ల నుండి ప్రతియేటా మత్తుపదార్థాలు దేశం లోకి అక్రమంగా రవాణా అవుతున్నాయని ఆయన అన్నారు. నేపాల్, పంజాబ్ ద్వారా దేశంలోకి డ్రగ్స్ వస్తున్నాయని రవికిషన్ చెప్పడం గమనార్హం. ఈ వ్యాఖ్యలపై సమాజ్ వాది పార్టీ ఎంపీ జయా బచ్చన్ తీవ్రంగా మండిపడ్డారు.
ఏదో కొద్దిమంది వ్యక్తులు ఇలా చేసినంత మాత్రాన మొత్తం పరిశ్రమను కించపరచడం సరి కాదని ఆమె అన్నారు. అది కూడా పరిశ్రమకు చెందిన వ్యక్తే ఈ ఆరోపణలు చేయడం తో తనకు సిగ్గుగా ఉందని జయాబచ్చన్ చెప్పడం గమనార్హం. అన్నం పెట్టిన చేతిని నరుక్కున్నట్లుగా రవి కిషన్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. జయా బచ్చన్ వేసిన కౌంటర్ ను రవి కిషన్ మళ్లీ తిప్పికొట్టాడు. పరిశ్రమలో ఎవరి సపోర్టు లేకుండా స్వయంకృషితో తాను పైకి వస్తే ప్రస్తుతం పరిశ్రమలో పూర్తిగా తుడిచిపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
చిత్ర పరిశ్రమ పై బాధ్యత కలిగిన వ్యక్తిగా తాను స్పందించానని పార్లమెంట్ లో కూడా అదే హక్కుతో ఈ అంశాన్ని ప్రస్తావించానని.. జయా బచ్చన్ తన అభిప్రాయాన్ని గౌరవించాలని అన్నారు. ఇకపోతే జయాబచ్చన్ వ్యాఖ్యలపై వివాదాస్పద నటి కంగనా రనౌత్ కూడా తనదైన శైలిలో స్పందించింది. సుశాంత్ స్థానంలో మీ కొడుకు అభిషేక్ బచ్చన్ ఉండి ఉంటే మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారా అంటూ ఆమెను ప్రశ్నించింది. సోషల్ మీడియా వేదికగా జయాబచ్చన్ వ్యాఖ్యలపై మండిపడ్డ కంగనా తన కూతురు శ్వేత టీనేజీలో నాలా బాలీవుడ్ లో దెబ్బలకి అలవాటుపడి లైంగిక వేధింపులకు గురైతే మీరు ఇలానే మాట్లాడుతారా అని ప్రశ్నించింది. మాపై కూడా కాస్త దయచూపండి అంటూ కంగనా జయా వ్యాఖ్యలపై తీవ్రంగా బదులిచ్చింది.