Breaking: మునుగోడు ఉప ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అధికారి టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును పోలిన గుర్తులను ఫ్రీ సింబల్స్ జాబితా నుండి తొలగించాలని కోరుతూ ఆ పార్టీ ఇంతకు ముందు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. అయితే ఈసీ నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో తెలంగాణ హైకోర్టులో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి అత్యవసర విచారణకు టీఆర్ఎస్ కోరింది. అయితే హైకోర్టు అత్యవసర విచారణకు స్వీకరించలేదు. రేపు ఈ పిటిషన్ ను విచారిస్తామని సీజే నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అయితే ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఎన్నికల అదికారులు వారి నిబంధనల మేరకు పోటీలో ఉన్న అభ్యర్ధులకు ఎన్నికల గుర్తుల కేటాయింపు ప్రక్రియ చేపట్టారు.
దీంతో సోమవారం రాత్రి చండూరులో రిటర్నింగ్ కార్యాలయం వద్ద టీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. కారును పోలిన గుర్తులను తొలగించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యేలు భగత్, చందర్, ఎమ్మెల్సీ రవీంద్రరావు నేతృత్వంలో వందలాది మంది టీఆర్ఎస్ శ్రేణులు రిటర్నింగ్ కార్యాలయం వద్ద భైటాయించి ఎన్నికల సంఘానికి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనతో చండూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.