తెలంగాణ రాజకీయ వర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యే, సీనియర్ నేత ఈటల రాజేందర్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర బీజేపీ నాయకత్వం కూడా తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహించింది. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపుతోంది. ఇతర పార్టీల లోని అసంతృప్తి నేతలను బీజేపీలోకి ఆకర్షించేందుకు ఒక టీమ్ ను బీజేపీ అధిష్టానం ఏర్పాటు చేసింది అంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. బీజేపీ చేరికల కమిటీకి కన్వీనర్ గా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈటల రాజేందర్ చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.
టీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మంచి రోజులు లేవని అందుకే పార్టీలో ఏవరినీ తీసుకోలేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆషాడమాసం నడుస్తున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో శ్రావణ మాసం రానుంది. శ్రావణ మాసం కోసమే ఆగినట్లు ఉన్నారు. ఈ నెల 27వ తేదీ తర్వాత పెద్ద సంఖ్యలో చేరికలు ఉంటాయని చెప్పారు ఈటల రాజేందర్. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈటల. టీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధులు బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని పేర్కొన్న ఈటల.. తమ పోరాటం కేవలం కేసిఆర్ తోనే కాదనీ, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కాదని అన్నారు. కేసిఆర్ అహంకారాన్ని అందరికంటే ముందు తాను ఎదిరించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఇప్పుడు తన బాటలో నడిచేందుకు చాలా మంది సిద్దంగా ఉన్నారని చెప్పారు.
ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందున వల్ల ఇప్పుడే టీఆర్ఎస్ నుండి బయటకు వస్తే వారి వారి నియోజకవర్గాల్లో అభివృద్ధికి ఆటంకం కలుగుతుందనే కారణంతో వారు బహిర్గతం కాలేకపోతున్నారని వివరించారు ఈటల. టీఆర్ఎస్ పార్టీలోని సహచరులతో తనకు 20ఏళ్లుగా అనుబంధం ఉందని, ప్రతి ఒక్కరితో తనతో టచ్ లో ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీవి మాటలే తప్ప కేసిఆర్ ను ఎదుర్కొనే సత్తా ఆ పార్టీకి లేదని అన్నారు ఈటెల. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరవచ్చని చెప్పారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తాను కేసిఆర్ పై పోటీ చేస్తానని, ఆయనను ఓడిస్తానని ఈటల ధీమా వ్యక్తం చేశారు.