Eatela Rajendar: టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత(!) ఈటల రాజేందర్ తమ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారా? మంత్రి వర్గం నుంచి తొలగించినప్పటికీ పార్టీ నేతగా ఉన్న ఈటల రాజేందర్ తన వైఖరిని స్పష్టంగా తెలియజేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్న ఆయన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో సమావేశం అయ్యారు. ఈ ఎపిసోడ్ సహజంగానే చర్చకు దారితీస్తోంది.
ఈటల కీలక సమావేశం
కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత , సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్కతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమావేశం అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. దీంతో తన కేంద్రంగా జరుగుతున్న భూ కబ్జా ఆరోపణలు, తన తొలగింపు గురించి ఈటల రాజేందర్ ఈ సమావేశంలో వివరించినట్లు తెలుస్తోంది. సహజంగానే ఈ ఎపిసోడ్ ఈటలపై టీఆర్ఎస్ నేతలు మరింత ఎదురుదాడి చేసేందుకు చాన్స్ ఇచ్చినట్లు అయిందని అంటున్నారు.
ఈటలతో భేటీ తర్వాత ఆయన ఫైర్….
అయితే, ఈటలతో సమావేశం అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి అసలు కారణం కేసీఆరే అని ఆరోపించారు. రాష్ట్రమంతటా అతలాకుతలం అవుతుంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రజలను గాలికి వదిలేశారని భట్టి విక్రమార్క అన్నారు. రాబోయే విపత్కర పరిస్థితులను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కేసీఆర్ పట్టించుకోలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. కరోనా నియంత్రణ కోసం సీనియర్ ఐఏఎస్ లతో మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. అంతేకాదు వెంటనే కరోనాను ఆరోగ్యశ్రీలో చేరాలని డిమాండ్ చేశారు.