KCR : తెలంగాణ ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు ఇది పరీక్ష సమయం. తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, ఇదే సమయంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానం ఆసక్తిగా మారింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో TRS అభ్యర్థి- సిట్టింగ్ MLC పల్లా రాజేశ్వర్రెడ్డి ముందంజలో ఉన్నారు. తర్వాతి స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న కొనసాగుతున్నారు. అయితే , వీరిద్దరి మధ్య స్వల్ప తేడా ఉండటం అసలైన అంశం.
ఏంటి తేడా ?
మొదటి ప్రాధాన్యత ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డికి 16 వేల 130ఓట్లు వస్తే.. తీన్మార్ మల్లన్నకు 12 వేల 46 ఓట్లు వచ్చాయి. అంటే కేవలం 4 వేల ఓట్ల తేడా ఉండటం అంటే … అందులోనూ ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థి కాకపోవడం పైగా టీఆర్ఎస్ పార్టీ , కేసీఆర్ అంటే విరుచుకుపడే నాయకుడు కావడంతో గులాబీ దళపతి సీరియస్గా తీసుకోవాల్సిన అంశం అని పలువురు కామెంట్ చేస్తున్నారు.
సోషల్ మీడియా ఎఫెక్ట్?
తీన్మార్ మల్లన్న ఇంత ఆదరణ పొందడం వెనుక సోషల్ మీడియా కారణం అని పలువురు అంచనా వేస్తున్నారు. ఆయన సొంతంగా నిర్వహించే యూట్యూబ్ ఛానల్ ఒక్కటే ఆయనకు అండగా నిలిచిన మీడియా. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీ నేతల కంటే కూడా మల్లన్న ఈ స్థాయి ఆదరణ పొందడం నాయకులు ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు విశ్లేషకులు.