KCR: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. ఇదే మాట ఆయనే స్వయంగా చెప్పారు. కేంద్రంలోని బీజేపీని సాగనంపుతామనీ, బీజేపీ వ్యతిరేక పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నాననీ కూడా పేర్కొన్నారు కేసిఆర్. పశ్చిమ బెంగాల్,. తమిళనాడు, మహారాష్ట్ర సీఎంలు మమతా బెనర్జీ, స్టాలిన్, ఉద్దయ్ ఠాకరే తదితరులతో ఇప్పటికే మాట్లాడాననీ పేర్కొన్నా కేసిఆర్ నిన్న మొన్న జరిగిన సభల్లో కేంద్రంలోని బీజేపి సర్కార్, మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. తాజాగా ఆదివారం ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ మోడీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మస్ట్ గో.. బీజేపీ ఈ దేశం నుండి వెళ్లిపోవాల్సిందే అంటూ మండిపడ్డారు. ఇలాంటి వాళ్లు అధికారంలో ఉండటానికి వీల్లేదని అన్నారు. ఇప్పటికే బీజేపీ పాపాలు ఎక్కువైయ్యాయయని మండిపడ్డారు. మోడికి ఇచ్చిన సమయంలో 80 శాతం అయిపోయిందన్నారు కేసిఆర్.
కేంద్రం నిధులు ఇవ్వడం లేదు
తెలంగాణలో విద్యుత్ సంస్కరణలు అమలుపర్చడం లేదని రావాల్సిన నిధులు కూడా కేంద్రం ఆపేస్తుందని కేసిఆర్ ఫైర్ అయ్యారు. కేంద్ర సంస్కరణలో తెలంగాణలో అమలు చేయమని స్పష్టం చేశారు. సంస్కరణల పేరుతో పేద ప్రజలను ఇబ్బంది పెట్టే ఆలోచనలో ఉన్నారని మండిపడ్డారు. విద్యుత్ శాఖను పూర్తిగా ప్రయివేటీకరించి ఆయన తాబేదార్లకు అప్పగించాలని మోడీ చూస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి విరాళాలు ఇచ్చే వారికి విద్యుత్ రంగాన్ని అప్పగించాలన్న కుట్ర జరుగుతోందని అన్నారు. 77 శాతం సంపద కేవలం పది మంది చేతుల్లోనే ఉందని ఆరోపించారు కేసిఆర్. సంస్కరణలతో చార్జీలు పెరుగుతాయని అన్నారు.
KCR: మోడీ చిట్టా అంతా ఉంది ఢిల్లీలో పంచాయతీ పెడతా
సంస్కరణల్లో బాగంగా సబ్సిడీలు ఎత్తివేయాలని కండిషన్లు పెట్టారనీ, అలా చేస్తే పేద ప్రజలు ఏమైపోతారని కేసిఆర్ ప్రశ్నించారు. కేంద్రం ఏ రంగంలో అభివృద్ధి సాధించిందో చెప్పాలని సవాల్ విసిరారు. బీజేపీ పాలనలో దేశం సర్వనాశనం అయ్యిందన్నారు. అన్ని రంగాలను అమ్మేసేందుకు మోడీ వచ్చారని అన్నారు. తనను జైల్లో వేస్తామని మోడీ పార్టీ బెదిరిస్తుందనీ, తనకు ఏం భయం లేదని కేసిఆర్ అన్నారు. మోడీ చిట్టా అంతా తన వద్ద ఉందన్న కేసిఆర్ రాఫెల్ డీల్ పై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. మోడీ హయాంలో 22 మంది బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయారని అన్నారు. జైలు అంటే తప్పు చేసిన వాళ్లకు భయమని తనకు కాదని అన్నారు. నూరు శాతం ఢిల్లీలో పంచాయతీ పెడతామని కేసిఆర్ అన్నారు.
అడ్డదారుల్లో అధికారంలోకి రావాలనుకునేది బీజేపీ
వాజ్ పేయి నాయకత్వంలోని బీజేపీకి కొంత నీతి నిజాయితీ ఉండేదనీ, ఇప్పుడు ఆ పార్టీకి సిద్ధాంతాలు, సిగ్గూ ఎగ్గు లేదన్నారు. ఎన్నికల్లో గెలవకపోయినా అధికారంలో ఉంటామని చెప్పే ఏకైక పార్టీ బీజేపి అని అన్నారు. కర్ణాకట, మధ్యప్రదేశ్, మణిపూర్, గోవా ఎన్నికల్లో గెలవకున్నా అధికారం చేపట్టారని అన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, కానీ అడ్డదారుల్లో అధికారంలోకి రావాలని ప్రయత్నించడం బీజేపీకి మాత్రమే సాధ్యమని కేసిఅర్ చెప్పారు.