Motkupalli Narasimhulu: ఓ పక్క తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ ఉప్పు, నిప్పు మాదిరిగా ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ కలలు కంటున్నారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించడం, ఆ తరువాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో మునుపెన్నడూ లేని విధంగా స్థానాలు కైవశం చేసుకోవడంతో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని ఢంకాభజాయించి చెబుతున్నారు. నిత్యం టీఆర్ఎస్ పార్టీపై, సీఎం కేసిఆర్ పై ఆరోపణలు, విమర్శలు చేస్తూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో పార్టీ స్టాండ్ కు భిన్నంగా ఓ బీజేపీ నాయకుడు సీఎం కేసిఆర్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హజరు కావడంతో పాటు కేసిఆర్ ను పొగడ్తలతో ముంచెత్తడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
దళిత్ ఎంపవర్మెంట్ పథకం విధివిధానాలపై చర్చించేందుకు సీఎం కేసిఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతిభవన్ లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్న బీజేపీ ప్రకటించింది. అయినప్పటికీ ఇతర రాజకీయ పార్టీ నేతలతో పాటు బీజేపీ నేత, మాజీ మంత్రి మోతుకుపల్లి నర్శింహులు సమావేశానికి హజరైయ్యారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పార్టీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన తరువాత ఆ సమావేశంలో మోతుకుపల్లి పాల్గొనడం ఒక ఎత్తు అయితే సీఎం కేసిఆర్ ను పొగడ్తలతో ముంచెత్తడం మరో ఎత్తు. ఈ పరిణామంతో బీజేపీ నేతలు విస్మయానికి గురైయ్యారు. ఎస్సీల అభివృద్ధి గురించి ఇంతగా తపించే సీఎం కేసిఆర్ కు భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని అనడంతో పాటు మరియమ్మ లాకప్ డెత్ విషయంలో సీఎం తీసుకున్న రక్షణ చర్యలతో దళితుల్లో విశ్వాసం పెరిగిందని అన్నారు. ఈ విషయంలో కేసిఆర్ చూపిన శ్రద్ధకు అభినందనలు తెలియజేశారు.
పార్టీ నిర్ణయానికి భిన్నంగా సమావేశంలో పాల్గొనడమే కాకుండా సీఎం కేసిఆర్ ను ప్రశంసలతో ముంచెత్తడం బీజేపీ నేతలకు ఆగ్రహం తెప్పించిందని అంటున్నారు. అధికార పార్టీకి దగ్గర అయ్యేందుకే మొతుకుపల్లి ఆ అవకాశాన్ని వాడుకున్నారా అనే మాట కూడా వినబడుతోంది. మొతుకుపల్లి బీజేపీలో చేరకముందు సుదీర్ఘకాలం టీడీపీలో పని చేశారు. పూర్వశ్రమంలో కేసిఆర్, మొతుకుపల్లి టీడీపీ ద్వారానే రాజకీయంగా ఎదిగిన విషయం అందరికీ తెలిసిందే. మొతుకుపల్లి భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా ఈ సమావేశానికి హజరయ్యారా లేక సాధారణంగానే హజరయ్యారా అనేది మరి కొద్ది రోజుల్లో తేలనున్నది.
కాగా సమావేశంలో దళితుల సామాజిక, ఆర్థిక బాధలు తొలగిపోవాలంటే ఏమి చేయాలో దశల వారీగా కార్యచరణ అమలు చేస్తామనీ, దళితులు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లడానికి ప్రభుత్వం ఏమి చేయాలో అఖిలపక్ష నేతలు సూచనలు, సలహాలు అందించాలని సీఎం కేసిఆర్ కోరారు. ఈ సందర్భంగా దళిత సాధికారత పథకంపై సమిష్టిగా నిర్ణయం తీసుకున్నారు. రూ.1200 కోట్లతో ఈ పథకం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఒక్కో యూనిట్ కి రూ.10లక్షల ఆర్థిక సాయం అందిస్తామనీ, నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్మును జమ చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో ప్రతి నియోజకవర్గం నుండి వంద కుటుంబాల చొప్పున పదివేల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు.