Revanth reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి నిర్వహించిన రాజీవ్ రైతు భరోసా యాత్ర పై అందరి దృష్టి నెలకొన్న విషయం తెలిసిందే. అచ్చంపేటలో ప్రారంభమైన రేవంత్ రెడ్డి రైతు భరోసా యాత్ర రావిరాలలో ముగిసింది. యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీలోని పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఈ సభకు రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితుడైన ఓ వ్యక్తి ఊహించని విధంగా హజరు కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వ్యక్తిగత సహాయకుడుగా పని చేసిన సూరీడు రేవంత్ సభా వేదికపై కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తొలి నుండి రాజశేఖరరెడ్డి ప్రతి కార్యక్రమంలోనూ వెన్నంటి ఉండే సూరీడు.. వైఎస్ మరణానంతరం ఆ కుటుంబానికి, మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ రోజు అకస్మాత్తుగా సభలో రేవంత్ సరసన కనబడటం, రేవంత్ తో కలిసి ఫోటో దిగడం సరికొత్త చర్చకు దారి తీసింది.
కాగా రేవంత్ సభకు తెలంగాణలోని పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు దూరంగా ఉండగా, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ లు పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, మాజీ ఎంపిలు సురేష్ షట్కర్, సిరిసిల్ల రాజయ్య, మల్లు రవి, పరిగి మాజీ ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి, కొండా సురేఖ, సంబాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే సీతక్క, మల్ రెడ్డి రంగారెడ్డి, కూన శైశైలం గౌడ్, గంగారాం, విజయ రమణారావు, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ తదితరులు హజరైయ్యారు.