TRS MP: ప్రజా ప్రతినిధులపై వివిధ కోర్టుల్లో విచారణలో ఉన్న కేసులను సత్వరమే ముగించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజా ప్రతినిధుల కోర్టులు కేసులను వేగంగా విచారించి పరిష్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ అధికార టీఆర్ఎస్ ఎంపి మాలోత్ కవితపై గతంలో నమోదైన కేసులో ప్రజా ప్రతినిధుల కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఎంపి కవితకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే సదరు ఎంపి రూ.10వేలు జరిమానా చెల్లించి ఆపై బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా కోర్టు వెంటనే బెయిల్ మంజూరు చేసింది.
విషయం ఏమిటంటే.. ఎన్నికలలో రాజకీయ పార్టీల నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు డబ్బులు పంపిణీ చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఎన్నికల సమయంలో వివిధ ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్న పెద్ద ఎత్తున నగదును సీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన మలోత్ కవిత ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేలా వ్యవహరించారన్న ఫిర్యాదుతో బూర్గంపహాడ్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ కేసును ప్రజా ప్రతినిధుల కోర్టుకు బదిలీ చేయగా విచారణ జరిపిన కోర్టు..నిందితురాలిపై నేరం నిరూపణ అయిన కారణంగా జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.
కాగా కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఎంపి కవిత రూ.10వేలు జరిమానా చెల్లించారు. ఆ వెంటనే తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు వెంటనే ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ప్రజా ప్రతినిధుల కోర్టులో ఎంపి కవిత దోషిగా నిర్ధారణ అయినా ఆమెకు తక్షణం బెయిల్ లభించడంతో జైలు ఊచలు లెక్క పెట్టకుండానే బయటకు వచ్చేశారు.