YS Sharmila: వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని కుట్రతో మట్టుబెట్టారని (హత్య) ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన షర్మిల.. తాజాగా కాంగ్రెస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని నర్సాపూర్ నియోజకవర్గంలో షర్మిల పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక వేళ వైఎస్ఆర్ ఇప్పుడు జీవించి ఉంటే ఆయన కాంగ్రెస్ పార్టీపై ఉమ్మేసి ఉండేవారని మండిపడ్డారు. 30 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారనీ, 2004, 2009 లో రెండు సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చారని గుర్తు చేశారు.
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలోనూ వైఎస్ఆర్ కీలకంగా వ్యవహరించారని అన్నారు. అలాంటి వైఎస్ఆర్ చనిపోతే ఆయన దోషి అని ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారని విమర్శించారు. ఇది వైఎస్ఆర్ ను కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచినట్లు కాదా అని ప్రశ్నించారు షర్మిల. హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ చనిపోతే ఆయన ఎలా చనిపోయారు అనే అంశంపై కనీసం కాంగ్రెస్ పార్టీ దర్యాప్తు కూడా చేయించలేదని ఆరోపించారు. ఆయన బ్రతికి ఉండగా ఇంద్రుడు, చంద్రుడు అని పొగిడిన వారు చనిపోయిన తరువాత ఆయనే దోషిగా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసి అవమానించారని అన్నారు. అలాంటి పార్టీకి వైఎస్ఆర్ ఫోటో పెట్టుకోవడానికి సిగ్గు ఉండాలని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ ఖ్యాతిని తీసుకువచ్చారే కానీ వైఎస్ఆర్ కు కాంగ్రెస్ ఖ్యాతిని తీసుకురాలేదని అన్నారు. వైెఎస్ఆర్ ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి కాదని పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి పథకాలు వైఎస్ఆర్ తీసుకువచ్చినవేనని గుర్తు చేస్తూ ఇలాంటి పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా అని ప్రశ్నించారు షర్మిల. పాదయాత్రలో ప్రజల కష్టాలు కళ్లారా చూసిన వైఎస్ఆర్ ఆ పథకాలు అన్నీ తీసుకువచ్చారని చెప్పారు. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత అయిదేళ్లు అధికారంలో ఉన్నా ఆ పార్టీ పేద ప్రజలకు చేసింది ఏమి లేదని విమర్శించారు. వైఎస్ఆర్ కు ప్రజల్లో ఉన్న చరిష్మాను వాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆయన ఫోటో పెట్టుకుంటోందని అన్నారు. ప్రజలకు అన్నీ తెలుసునని పేర్కొన్నారు.