వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ముమ్మరం చేసింది. అందులో కీలకంగా ఉన్న అనుమతులు జాబితాను సిద్ధం చేసుకుంది. ఒక 15 మందిని అనుమానితులుగా చేర్చి దశల వారీగా వారిని విచారించనుంది. దీనిలో భాగంగానే పలు ప్రాధమిక సమాచారం రాబట్టేందుకు వివేకా కుమార్తె సునీతను నిన్న పిలిపించి విచారించారు. కడప సెంట్రల్ జైలు లోని అతిధి గృహాన్ని కేంద్రంగా చేసుకొని సిబిఐ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.
ఈ రోజు నుండి దర్యాప్తు మరింత కీలకం కానుంది.
ఎవరెవరిని ఎప్పుడు పిలిపిస్తారు? ఎవరిని అనూహ్యంగా కస్టడీలోకి తీసుకుంటారో అనేది మాత్రం సందేహంగా మారింది. కొన్ని అరెస్ట్ లు కూడా ఉండవచ్చు అని భావిస్తున్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా సిబిఐ అధికారులు ఇప్పటికే పులివెందులలో వివేకా ఇంటిని జల్లెడ పట్టారు. అణువణువు పరిశీలించారు. వివేకా ఇంటి వాచ్ మెన్, ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి, వివేకా పీఏ, డ్రైవర్ ప్రసాద్, ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న అప్పటి పులివెందుల సీఐ శంకరయ్య సహా పలువురుని విచారించిన సిబిఐ అధికారులు… వివేకా కుమార్తె తెలిపిన వివరాలు, విచారణలో వచ్చిన అంశాల ఆధారంగా ఎవరెవరిని విచారించాలనే దానిపై ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.
సిబిఐ అధికారులు విచారించాల్సిన జాబితాలో కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వై ఎస్ భాస్కర్ రెడ్డి, బాబాయ్ వై ఎస్ మనోహర్ రెడ్డితో పాటు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది.
ఎన్నికలకు ముందు వివేకా హత్య జరిగినా ఇంత వరకు సిట్ దర్యాప్తు లో దోషులను గుర్తించలేక పోయారు. ఏపి హైకోర్టు ఆదేశాలతో సిబిఐ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.