Domestic Gas: వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపిలో వంట గ్యాస్ ధర రూ.850లకుపై మాటే. సబ్సీడీ అంతంత మాత్రంగానే వినియోగదారులకు అందుతోంది. అయితే ఎల్పీజీ సిలెండర్ వినియోగదారులకు ఓ పక్క ధరల బాదుడు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ అందించింది. అది ఏమిటంటే.. వంట గ్యాస్ వినియోగదారులు తమకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్ ను ఎంపిక చేసుకోవచ్చు. అంటే వినియోగదారుడు ఇకపై ఏ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్ద నుండైనా సిలెండర్ ఫిల్ చేయించుకోవచ్చు.
ఇప్పటి వరకూ వంట గ్యాస్ వినియోగదారులు ఏదో ఒక డిస్ట్రిబ్యూటర్ వద్దనే గ్యాస్ సిలెండర్ తీసుకునే వారు. దీనిపై ఇటీవల లోక్ సభలో కొందరు సభ్యులు కేంద్ర మంత్రిని ఈ సమస్యపై ప్రశ్నించారు. ఎల్పీజీ వినియోగదారులు స్వయంగా డిస్ట్రిబ్యూటర్ ను ఎంపిక చేసుకునే అవకాశం లేదా అని ప్రశ్నించగా దానికి కేంద్ర పెట్రోలియం, సహజ ఇంధన వనరుల శాఖ మంత్రి రామేశ్వర్ తేలీ సమాధానం ఇచ్చారు. ఇకపై గ్యాస్ వినియోగదారులు తమకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్ ను ఎంపిక చేసుకుని తమ గ్యాస్ సిలెండర్ ను తీసుకోవచ్చని తెలియజేశారు.