ప్రస్తుత కాలంలో జనావాసం పెరుగుతున్న నేపథ్యంలో వారి నివాసం , జీవనోపాధి కోసం అడవులను నరికి పరిశ్రమలు, నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనివల్ల ఎన్నో వేల ఎకరాల్లో విస్తరించిన అడవులను నాశనం చేయడం ద్వారా అందులో నివాసముండే ఎన్నో జంతువులు అంతరించిపోతున్నాయి. మరి కొన్ని జంతువులు జనావాసాల మధ్య సంచరిస్తున్నాయి.
ఇలాంటి ఘటనే ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. అరుదైన వింత జంతువును సత్తుపల్లి లోని జెవిఆర్ ఓపెన్ కాస్ట్ సమీపంలో కొందరు లారీ డ్రైవర్లు అరుదైన జంతువును గుర్తించారు. స్థానికుల సహాయంతో వారు ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చిన ఫారెస్ట్ సిబ్బంది ఆ జంతువులు పరిశీలించి ఇది ఒక అరుదైన, అంతరించిపోతున్న మూషిక జింక అని తెలిపారు.
ఈ అరుదైన జంతువులు దట్టమైన అటవీ ప్రాంతాల్లో నివసిస్తుందని, ఈ అటవీ ప్రాంతంలో ఈ మూషిక జింక ఆచూకీ లభ్యం కావడం ఎంతో విశేషం అని చెప్పారు. అయితే ఈ జింక వయసు దాదాపు మూడు నెలలు ఉంటుందని అధికారులు తెలిపారు. స్థానిక రేంజర్ వెంకటేశ్వర్లు ఆదేశాలతో ఈ మూషిక జింకను ఫారెస్ట్ సిబ్బందికి అప్పగించారు.
ఫారెస్ట్ అధికారులు ఈ మూషిక జింక పిల్లను కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యానికి తరలించారు. అయితే ఫారెస్ట్ సిబ్బంది మాట్లాడుతూ అడవులను విపరీతంగా నరకడం వల్ల ఇలాంటి అరుదైన జంతువులు అంతరించిపోయే ప్రమాదం ఉందని, అడవులను రక్షించడం, వన్య ప్రాణులను కాపాడడం మన ప్రాథమిక బాధ్యత అని తెలిపారు. ఇలాంటి అరుదైన జంతువులు జనావాసాల మధ్య కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని అటవీశాఖ అధికారులు తెలిపారు. అలా కాకుండా వన్యప్రాణుల హింసించడం చట్టరీత్యా నేరమని అటవీశాఖ సిబ్బంది పేర్కొన్నారు.