YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుపై ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలకు, వివేకా కుమార్తె సునీతకు కడప జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులపై వివేకా కుమార్తె డాక్టర్ సునీత నర్రెడ్డి స్పందించారు. కడప కోర్టు ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు.
న్యాయం కోసం ప్రజా తీర్పు కోరుతుంటే వైసీపీ అడ్డుపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందులలో తాను ప్రచారం చేయకుండా కేసులు వేస్తున్నారని అన్నారు. వివేకా హత్య అంశంపై వైసీపీ నాయకులు కూడా చాలా సార్లు మాట్లాడారని ఆమె అన్నారు. ఎన్నికల్లో షర్మిలను గెలిపించే బాధ్యత ప్రజలదేనని అన్నారు. అందరి ఇళ్లకు రాలేకపోతున్నందుకు మన్నించాలని సునీత కోరారు.
ప్రస్తుత ఎన్నికల తరుణంలో వివేకా హత్య కేసు విషయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా ఉంది. ఈ అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, ప్రతిపక్ష పార్టీల నేతలు చంద్రబాబు, లోకేష్, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ తదితరులు ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ, అధికార వైసీపీని ఇరుకున పెడుతున్నారు.
ఈ తరుణలో వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు కడప జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కడప కోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. కాగా, కడప కోర్టు ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేయనున్నట్లు సునీత తెలిపారు.