ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ వల్ల అగ్రరాజ్యం అమెరికా ఎక్కువగా నష్టపోయింది. దేశంలో భయంకరమైన మరణాలు చోటుచేసుకోవడంతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థను కరోనా వైరస్ చిన్నాభిన్నం చేసింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ సృష్టికర్త చైనా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఎప్పటికప్పుడు మండిపడుతూ ఆ దేశం పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. వైరస్ వల్ల అమెరికాలో చాలా నష్టం వాటిల్లడంతో చైనాలో అమెరికా వ్యాపార దిగ్గజాలు పెట్టిన పెట్టుబడులు వెనక్కి వచ్చేలా మొన్నటి వరకు చర్యలు చేపట్టారు.
ఉన్న కొద్దీ ఈ రెండు దేశాల మధ్య వివాదాలు ముదురుతున్నాయి. చైనా కి వ్యతిరేకంగా ఇప్పటికే గళమెత్తిన అమెరికా దూకుడుగా డ్రాగన్ కంట్రీకి దిమ్మతిరిగిపోయే విధంగా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. హ్యూస్టన్ లోని చైనా రాయబార కార్యాలయని 72 గంటల్లో మూసివేయాలని అమెరికా హెచ్చరించింది. అమెరికన్ల మేధాసంపత్తి తోపాటు ప్రైవేటు సమాచారాన్ని రక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా వెల్లడించింది. దీంతో అమెరికా నిర్ణయంపై చైనా మండిపడింది. ఈ నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు తెలిపింది. అమెరికా తీసుకున్న నిర్ణయం సరైంది కాదని పేర్కొంది.