టీఆరెస్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి ఈరోజు ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలం నుండి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు.
సోలిపేట రామలింగారెడ్డి ప్రజలకు విశేషంగా సేవలు అందించారు. ఏకంగా నాలుగు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2001 నుండి కేసీఆర్ తో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నారు. కేసీఆర్ పిలుపు మేరకే పాతికేళ్ళు జర్నలిస్ట్ గా పనిచేసిన ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2004, 2008, 2014, 2019 ఎన్నికల్లో దుబ్బాక నియోజికవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు రామలింగారెడ్డి. దుబ్బాకను అభివృద్ధి పథంలో నడిపిన సోలిపేట రామలింగారెడ్డి మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా దుబ్బాక ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. అధికార లాంఛనాలతో రామలింగారెడ్డి మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.