రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం కొత్త అభియోగాన్ని ఎదుర్కోవలసి వస్తోంది! నరసాపురం రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈ తరహా ఆరోపణ చేశారు!దాంతో అది రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది! తన ఫోన్ ట్యాపింగ్ అవుతోందని ఆ ఎంపీ ఆరోపించారు!
తాను పార్లమెంట్ సభ్యుడినని.. అనేక స్టాండింగ్ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నానని.. తన ఫోన్ ను ట్యాప్ చేసి కీలకమైన సమాచారాన్ని సేకరిస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తంచేశారు.ఈ అంశాన్ని ఆయన కేంద్రం వద్దకు తీసుకెళ్తున్నారు.ఫోన్ ట్యాపింగ్ నిజమైతే జగన్ ప్రభుత్వమే కూలిపోతుందని ఆయన హెచ్చరిస్తున్నారు. నర్సాపురం ఎంపీ రోజురోజుకీ వైసిపికి పంటికింద రాయిలా మారుతున్నారు! వైసిపి పైన జగన్ మీద రోజుకో కొత్త ఆరోపణతో రఘురామరాజు మీడియా ముందుకొస్తున్నారు. పంచ్ డైలాగులు, సెటైర్లతో ఆయన మాట్లాడుతూ ఉండడంతో మీడియా లో కూడా హైపు వస్తోంది!తాను ప్రభుత్వానికి మాత్రమే సూచనలు చేస్తున్నానని, పార్టీని పల్లెత్తు మాట అనడం లేదని ఆయన అంటున్నారు. వైసీపీ కూడా ఆయన విషయంలో చేయాల్సిందంతా చేసింది. ఇక చేయగలిగిందేమీ లేకపోవడంతో ఆగిపోయింది. ఆనర్హతా వేటుకు స్పీకర్కు సిఫార్సు చేయడం దగ్గర్నుంచి ఆయనను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్గా ఆయన పదవిని తొలగించాలని చాలా ప్రయత్నాలు చేశారు.
కానీ ఏవీ సక్సెస్ కాలేదు. స్పీకర్ కేవలం లోక్సభ లో రాజు సీట్ మాత్రమే మార్చారు. మరోవైపు కేంద్రం ఆ ఎంపీకి వై కేటగిరీ భద్రతను ఇచ్చింది.ఇవన్నీ చూస్తుంటే కమలనాథులు రఘురామరాజు ను కాపాడుతున్నట్లుగా కనిపిస్తోంది! దీంతోనే ఆర్ఆర్ఆర్ రెచ్చిపోతున్నాడు అని వైసిపి వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రస్తుతానికి ఆయన హవా బాగుందని, కానీ ఒక్కసారి వైసీపీ ప్రభుత్వం కూడా అదే స్థాయిలో దృష్టి పెడితే ఆ ఎంపీ ఇబ్బంది పడక తప్పదని ఆ వర్గాలు చెబుతున్నాయి! రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే అధికారాలు ఆపరిమితమని ఎంపీ అయినా మరొకరయినా సర్కార్ కు అతీతమేమీ కాదని, పైగా సదరు ఎంపీ పారిశ్రామికవేత్త అన్న విషయాన్ని మరిచి పోతున్నాడని వైసిపి వర్గాలు హెచ్చరిక స్వరం వినిపిస్తున్నాయి! సీఎం జగన్ ను లైట్ గా తీసుకుంటే పరిణామాలు అనూహ్యంగా ఉంటాయని చెబుతున్నారు. ఇప్పటికైనా ఈ రాజుగారు మాట వింటారా? తిరుగుబాటలోనే నడుస్తారా!