ఒక్కసారి మాట ఇస్తే వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని జగన్ ఎప్పుడూ చెబుతూ ఉంటారు. ప్రస్తుతం ఏపీ సీఎం గా వ్యవహరిస్తున్న జగన్ తాను ఇచ్చిన మాటను ఏదో రీతిలో నెరవేర్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ… ఏడాదిలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఇచ్చిన ఎన్నికల మ్యానిఫెస్టో వాగ్దానాలు 90% నెరవేర్చడం జరిగింది. ఇదే తరుణంలో రాజధాని అమరావతి లో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని జగన్ సర్కార్ 107 జిఓ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
దీంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవోను అమరావతి రైతులు హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. హైకోర్టు అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో స్టే విధించింది. దీంతో జగన్ ప్రభుత్వం తాజాగా హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని… సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం నేతృత్వంలో విచారణ చేసి ఈ విషయాన్ని మళ్లీ హైకోర్టులోనే తేల్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
అమరావతి రైతులు హైకోర్టు లో వేసిన పిటిషన్ లో 13 జిల్లాల ఏపీ రాజధాని కోసం తామంతా భూములు త్యాగం చేశామని, కేవలం రాజధాని కోసమే తమ భూములను ఇవ్వటం జరిగిందని, ఇతర అవసరాలకు ఆ భూములను ఉపయోగించకూడదు అనేది సిఆర్డిఏ చట్టంలో ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వానికి రాజధాని అమరావతి భూములు పేదలకు పంచే విషయంలో అటు హైకోర్టులో ఇటు సుప్రీంకోర్టులో వ్యతిరేక రీతిలో తీర్పులు రావటంతో…. ఇక తప్పదు తప్పులేదు వెనకడుగు వెయ్యాల్సిన టైం వచ్చింది అనే టాక్ పార్టీలో వినపడుతోంది.
ఈ విషయంలో మరింత రాద్ధాంతం చేస్తే న్యాయస్థానాలు నుండి తీవ్రస్థాయిలో వ్యతిరేకత ప్రభుత్వంపై వచ్చే అవకాశం ఉందని, అది ఇంకా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని పార్టీ నేతలు లోలోపల డిస్కషన్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు వరుసగా జగన్ ప్రభుత్వానికి న్యాయస్థానాలలో మొట్టికాయలు మీద మొట్టికాయలు పడటంతో…విపక్షాల నుండి తీవ్ర స్థాయిలో సెటైర్లు పడుతున్నాయి. తీసుకున్న నిర్ణయాలు కరెక్టయితే న్యాయస్థానాలలో ఎందుకు విఫలమవుతాయి అని కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అనేకసార్లు వాయిదా పడటంతో తాజాగా కోర్టు తీర్పుతో ప్రభుత్వానికి మొట్టికాయలు పడటంతో…ఈసారి పక్కా వ్యూహంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇళ్ల పట్టాల కార్యక్రమం జరిగేలా ఏపీ ప్రభుత్వ అధికారులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.