ఎవరూ అడగకుండానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరుగున పడిపోయిన ప్రత్యేక హోదా అంశాన్ని ఎందుకు తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించారనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్!
నిజానికి అధికారంలోకి రాకముందు ప్రత్యేక హోదా అంటూ హడావుడి చేసిన జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ విషయమై పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు!ఎందుకనో టిడిపి కూడా ఈ సబ్జెక్టు మీద ఎక్కువగా మాట్లాడలేదు! ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు మాట్లాడితే నువ్వు అధికారంలో ఉన్న ఐదేళ్లు ఏం చేసావ్ అని అందరూ నిలదీసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆయన మౌనంగా ఉన్నారంటారు!చంద్రబాబు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ని అంగీకరించడం ఆ తరువాత మళ్లీ ప్రత్యేక హోదా కావాలంటూ రాజకీయ డ్రామాలు నడపడం తెలిసిందే! అయితే ఆయన యూ టర్న్ రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిప్పికొట్టారు.అధికారంలో నుండి బాబును దింపేశారు.
ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం ఎందుకు మళ్లీ మాటలు పడడం ఎందుకు అని చంద్రబాబు నోరు కట్టేసుకున్నారు. కాబట్టి జగన్ ను ప్రత్యేక హోదా గురించి అడిగేవాడే లేడు. కానీ సీఎం స్వయంగా తన స్వాతంత్ర దినోత్సవ సందేశంలో ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించడం వెనుక మాస్టర్ ప్లాన్ ఉందంటారు. మూడు రాజధానుల కు ప్రత్యేక హోదా కు లింకు గలిపే రాజకీయాన్ని జగన్ చేశారంటున్నారు.మూడు రాజధానులు విషయం ఇప్పుడు హైకోర్టులో ఊగిసలాడుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు హైకోర్టులో గవర్నర్ ఆమోద ముద్ర కు వ్యతిరేకంగా దాఖలు చేసిన అఫిడవిట్ లో విభజన చట్టం అనే పదాన్ని వాడడమే వారి పాపం అయిపోయింది. అంతే జగన్ మెదడు పాదరసంలా పనిచేసింది.
ఇన్ని రోజులు ప్రత్యేక హోదా అనే అంశం మరిచిపోయిన ముఖ్య మంత్రి అసలు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే…. విభజన చట్టం అమలు చేసినట్లు కాదన్న పాయింటు పట్టుకున్నారు . దానిని మూడు రాజధానులకు లింక్ పెట్టాలంటే ముందు ప్రత్యేక హోదా కేంద్రం నుంచి రావాలని…. ఒక చట్టం లో రెండూ అంశాలు కచ్చితంగా అమలు కావాలని… ఒకటి అమలయి ఇంకొకటి అమలు కాకపోతే అసలు ఆ చట్టానికి విలువ ఉండదని జగన్ వాదిస్తూ అదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.అసలు ఇలాంటి ఆలోచనే ఎవరికీ రాదు. ఈ తెలివితేటల్లో జగన్ ముందు చంద్రబాబు తేలిపోయాడు అనే చెప్పాలి. అయితే చంద్రబాబును గమనించినట్లే తనపై కూడా రాష్ట్ర ప్రజలు ఒక కన్నేసి ఉంటారని జగన్ తెలుసుకోవడం కూడా ముఖ్యమే.