కరోనాతో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. దీని బారిన పడి చాలా మంది ప్రాణాలను వదిలారు. ఈ మహమ్మారిని తరిమేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు శాస్ర్తవేత్తలు. అయినా ఇప్పటి వరకూ దీన్ని నివారించే వ్యాక్సిన్ మాత్రం అందుబాటులోకి రాలేదు. ప్రపంచ వ్యాప్తంగా రోజుకు కొన్ని లక్షల మంది దీని బారిన పడుతున్నారు.
కోవిడ్ 19 విషయంలో రోజురోజుకూ కొత్త కొత్త విషయాలు బయటపడుతునే ఉన్నాయి. దీన్ని మొదట గుర్తించడానికి జ్వరం, దగ్గు, జలుబు, పాదాలపై ఎర్రటి గుర్తులు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో గుర్తుపట్టేవారు. ఇవే కాకుండా కోవిడ్ 19 మరో రూపంలో తన కొత్త లక్షణాన్ని బయటపెట్టింది. కరోనా వైరస్ సోకిన వారి కళ్లల్లో రక్తం గడ్డకట్టడాన్ని వైద్య నిపుణులు గుర్తించారు. ఇలాంటి కేసులు బీహార్ లో ఇటీవల ఎక్కువగా నమోదు అయ్యాయని వెల్లడించారు. కళ్లలో ఎర్రటి గుర్తులు కనిపిస్తున్నాయని ప్రజలు ఆస్పత్రులకు రాగ వారికి పరీక్షలు చేయగా కరోనా పాజిటీవ్ అని తేలిందని వైద్యులు వెల్లడించారు.
పాట్నా ఎయిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. కరోనా వల్ల సంభవించే లక్షణాలు ఇప్పుడు కళ్లపై కూడా కనిపిస్తున్నాయనీ, ఇది అత్యంత ప్రమాదకరమని తెలిపారు. దీని వల్ల కంటిలోని రెటీనాలో రక్తం గడ్డకడుతుందని తెలిపారు. అలాగే ఇందిరా గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని ప్రాంతీయ కంటి కేంద్ర వైద్యులు అటువంటి లక్షణాలున్న రోగులకు కరోనా పరీక్షలు చేయగా పాజిటీవ్ వచ్చినట్టు నివేదికల ద్వారా వెల్లడైంది.
వైద్యులు తెలిపిన సమాచారం మేరకు.. పాట్నా ఎయిమ్స్ లో 30 మంది రోగులు ఇదే లక్షణాలతో ఆస్పత్రితో చేరినట్టు తెలిపారు. అయితే అలాంటి రోగులకు కంటి సమస్యలు, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయని స్పష్టం చేశారు. అలాగే కరోనా నుంచి బయటపడిన వారిలో 25 శాతం మందికి వైరల్ కండ్ల కలక , 7 శాతం మందికి రెటీనాపై రక్తం గడ్డకట్టిదని ప్రాంతీయ ఐ డిపార్ట్ మెంట్ డాక్టర్ తెలిపారు. దీని మూలంగా కన్ను కోల్పోయే ప్రమాదం కూడా పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.
కండ్లల్లో దురద, మంట, కండ్ల నుంచి నీరు కారడం, నొప్పి రావడం వంటి లక్షణాలు వస్తాయని వాటిని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయొద్దని సూచిస్తున్నారు. సీజనల్ గా వ్యాపించే వ్యాధుల కంటే ప్రస్తుతం ఈ కరోనానే జనాలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. దీని బారి నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు.