తీవ్ర అనారోగ్యంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి నాయిని నర్శింహరెడ్డి బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత తుది శ్వాస విడిచారు. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసుపత్రిలో నాయినిని పరామర్శించారు. తొలుత కరోనా నుండి కోలుకున్న నాయిని మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు కొద్ది రోజుల క్రితం అపోలో ఆసుపత్రిలో చేర్పించగా అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో వెంటిలేటర్ పై ఉంచి వైద్యం అందించారు. గత వారం రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
నిన్న సాయంత్రం ఆసుపత్రికి చేరుకున్న సీఎం కేసిఆర్ నాయిని అరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నాయిని అల్లుడు శ్రీనివాసరెడ్డిని ఓదార్చి ధైర్యం చెప్పారు. నాయినితో ఉన్న అనుబంధంతో భావోద్వేగానికి గురైన కేసిఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. నాయిని భార్య అహల్య, కుమారుడు, అల్లుడు కూడా కరోనా బారిన పడి చికిత్స అనంతరం కోలుకున్నారు.
1944లో నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము గ్రామంలో జన్మించిన నాయిని నర్శింహరెడ్డి కార్మిక నాయకుడుగా పేరు సంపాదించారు. 1947లో హింద్ మజ్దూర్ సభ (హెచ్ఎంఎస్) రాష్ట్ర శాఖ స్థాపించిన నాయిని చివరి వరకూ కార్మిక సంక్షేమానికి సేవలు అందించారు. 1969 నాటి తొలి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల భూమికను పోషించారు. ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సోషలిస్ట్ పార్టీ నేతగా ఉద్యమించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి తుది శ్వాస విడిచే వరకూ ఆ పార్టీలోనే కొనసాగారు. 1978,1985,2004లో ముషీరాబాద్ నుండి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. 2005లో వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పని చేశారు. తెలంగాణ ఉద్యమంలో కేసిఆర్తో కలిసి పని చేయడంతో టీఆర్ఎస్ తొలి సారి అధికారంలోకి రాగానే నాయినికి కేసిఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కీలకమైన హోంశాఖను అప్పగించారు కెసిఆర్. నాయినికి భార్య, ఒక కుమార్తె సమతా రెడ్డి, కుమారుడు రవీందర్ రెడ్డి ఉన్నారు.